జిల్లాలో 94,464 హెక్టార్లలో పంటనష్టం
ABN , First Publish Date - 2020-11-28T06:17:56+05:30 IST
జిల్లాలో 94,464 హెక్టార్లలో పంటనష్టం
విజయవాడ సిటీ : నివర్ తుఫాను కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో 94,464 హెక్టార్లలో పంటనష్టం జరిగిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన రెవెన్యూ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా జిల్లాలోని 34 మండలాల్లోని 326 గ్రామాల్లో పంటనష్టం వాటిల్లిందని చెప్పారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 93,876 హెక్టార్లలో వరి, 150 హెక్టార్లలో పత్తి, 45 హెక్టార్లలో వేరుశెనగ, 49 హెక్టార్లలో మినుము పంటలు పాడయ్యాయన్నారు. హార్టికల్చర్ పంటలకు సంబంధించి 348 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందన్నారు. 11 ఇళ్లు, 5 కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. ఒక కచ్చా ఇల్లు పూర్తిగా పాడైందని తెలిపారు. నాలుగు పాకలు పూర్తిగా పాడైనట్టు చెప్పారు. విద్యుత్ శాఖకు సంబంధించి 33/కేవీ ఫీడర్లు 9, 11/కేవీ ఫీడర్లు 4కు నష్టం వాటిల్లిందన్నారు. 70 ఎలక్ర్టికల్ పోల్స్ దెబ్బతిన్నాయని చెప్పారు. జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.