ఔటర్ బ్రిడ్జికి ప్రమాదం లేదు..
ABN , First Publish Date - 2020-10-21T11:02:33+05:30 IST
భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్సాగర్ 13 గేట్లను ఎత్తడంతో భారీగా వరద ముంచెత్తింది. వరద ప్రవాహానికి పలు రోడ్లు, పైపులైన్ వ్యవస్థలు కొట్టుకపోయాయి
మంత్రి ఆదేశాలతో హెచ్ఎండీఏ ఇంజనీర్ల పరిశీలన
హైదరాబాద్ సిటీ, అక్టోబర్20 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్సాగర్ 13 గేట్లను ఎత్తడంతో భారీగా వరద ముంచెత్తింది. వరద ప్రవాహానికి పలు రోడ్లు, పైపులైన్ వ్యవస్థలు కొట్టుకపోయాయి. ఆ ప్రవాహానికి ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి కంపిస్తోందని, ప్రమాదం పొంచి ఉందని పలువురు నెటిజన్లు ట్విటర్లో కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వెంటనే హెచ్ఎండీఏ ఇంజనీర్లు ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిని పరిశీలించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఇంజనీర్లతో కలిసి ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిని పరిశీలించారు. ఔటర్పై భారీ వాహనాలు పోయే క్రమంలో ఫ్లై ఓవర్ కంపించడాన్ని గమనించారు. అది సాధారణంగా ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జిలకు వచ్చే ప్రకంపనని, దాని వల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని ఇంజనీరింగ్ అధికారులు తేల్చారు.