ఖర్చంతా వృథా

ABN , First Publish Date - 2021-08-24T05:30:00+05:30 IST

మండలకేంద్రంలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండు నిరుపయోగంగా మారింది.

ఖర్చంతా వృథా
నిరుపయోగంగా ఉన్న ఏర్పేడు ఆర్టీసీ బస్టాండు

ఏర్పేడు, ఆగస్టు 10: మండలంకేంద్రంలో 15ఏళ్ల కిందట రూ.లక్షల వ్యయంతో ఆర్టీసీ బస్టాండు నిర్మించారు. అయితే ఎందుకనో ఒక్కరోజు ఇక్కడ బస్సులు నిలిచిన దాఖలా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో రాత్రిళ్లు మందుబాబులు, ఆకతాయిలు చేరడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. బస్టాండు నిరుపయోగంగా మారడంతో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితరప్రాంతాలకు వెళ్లే జనం ప్రధాన రహదారి పక్కనే ఆగిన బస్సులను ఎక్కాల్సి వస్తోంది. ఎండావానకు అవస్థలు పడుతూ బస్సుల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. స్వగ్రామాలకు వెళుతూ రోడ్డు దాటుతున్న పలువురు ప్రయాణికులు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటనలూ జరిగాయి. అయితే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, బస్టాండ్‌ నిరుపయోగంగా మారినా.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యను పరిష్కరించడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బస్టాండ్‌ను అందుబాటులోకి తేవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

Updated Date - 2021-08-24T05:30:00+05:30 IST