కొవిడ్ కేర్ రైలు బోగీల్లో ఒక్క రోగి కూడా చేరలేదు...

ABN , First Publish Date - 2020-10-25T15:24:27+05:30 IST

కొవిడ్-19 రోగులకు ఐసోలేషన్ చికిత్స అందించేందుకు రైల్వే శాఖ రూ.6కోట్లు వెచ్చించి కరోనా ఐసోలేషన్ రైలు బోగీలను ఏర్పాటు చేసినా....

కొవిడ్ కేర్ రైలు బోగీల్లో ఒక్క రోగి కూడా చేరలేదు...

 రూ. 6 కోట్లు వెచ్చించినా వృథా...ఆర్టీఐలో తేలిన నిజం

ముంబై : కొవిడ్-19 రోగులకు ఐసోలేషన్ చికిత్స అందించేందుకు రైల్వే శాఖ రూ.6కోట్లు వెచ్చించి కరోనా ఐసోలేషన్ రైలు బోగీలను ఏర్పాటు చేసినా ఒక్క రోగిని చేర్చుకోలేదని ఆర్టీఐ సమాచారం కింద వెలుగుచూసింది. కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో రోగులకు ఐసోలేషన్ చికిత్స అందించేందుకు వీలుగా మార్చి నెలలో రైల్వేబోర్డు ఆదేశాల మేర సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే రూ.6కోట్ల వ్యయంతో 892 రైలుబోగీలను కొవిడ్ కేర్ కోచ్ లుగా రూపొందించారు. మహారాష్ట్రలో అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగులకు సేవలు అందించేందుకు రైలు బోగీలను కొవిడ్ కేర్ కోచ్ లుగా మార్చారు.


ఒక్కో బోగీని కొవిడ్ కేర్ కోచ్ గా మార్చడానికి రూ.85వేలు వెచ్చించారు. దీనిపై థానే నగర నివాసి రవీంద్ర భగవత్ ఆర్టీఐ కింద దాఖలు చేసిన ప్రశ్నకు రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది. ఒక్క కరోనా రోగిని కొవిడ్ కేర్ కోచ్ లో చేర్చుకోలేదని రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది. తిరిగి కొవిడ్ కేర్ కోచ్ లను సాధారణ బోగీలుగా మార్చడానికి రైల్వేకు అదనపు ఖర్చు కానుంది. ఇలా మహారాష్ట్రతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 5వేల రైలు బోగీలను కొవిడ్ కేర్ కోచ్ లుగా మార్చారు. దీనివల్ల మహారాష్ట్రలో ఒక్క కరోనా రోగికి కూడా ఐసోలేషన్ సేవలు అందించక పోగా కొవిడ్ కేర్ కోచ్ ల కోసం వెచ్చించిన రూ.6కోట్లు వృథా అయ్యాయి.

Updated Date - 2020-10-25T15:24:27+05:30 IST