భూకంపం కాదు.. పేలుడే
ABN , First Publish Date - 2021-03-02T05:33:23+05:30 IST
శనివారం తెల్లవారుజామున అందరినీ భయపెట్టిన..
ప్రాథమిక విచారణలో అధికారుల నిర్థారణ
కర్లపూడి గ్రానైట్ క్వారీలో అధికారుల పరిశీలన
అమరావతి: శనివారం తెల్లవారుజామున అందరినీ భయపెట్టిన శబ్ధం భూకంపం కాదని అది మండలంలోని కర్లంపూడి క్వారీలో చోటుచేసుకున్న పేలుడని అధికారులు నిర్ధారించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం సెంట్రల్ మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ యోహాన్ తన బృందంతో పరిశీలన చేశారు. పేలుడు జరిగిన ప్రదేశంలో ఏర్పడిన గొయ్యిని క్వారీ నిర్వాహకులు మట్టితో పూడ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో ఎక్స్వేటర్ ద్వారా మట్టిని అధికారులు తీయించి మరీ పరిశీలించారు. అయితే ఆ గొయ్యిలో పేలుడుకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. క్వారీకి సమీపంలోని పంట పొలాల్లో పడిన మట్టి పెళ్లలు ఉండటాన్ని గుర్తించారు. వాటిని పరిశీలించగా మందుగుండు వాసన వస్తుందని, దీంతో ఖచ్చితంగా పేలుడు జరిగినట్లు నిర్థారించారు. వాటిని పరీక్షల కోసం అధికారులు సేకరించారు. పేలుడు జరిగిన సమయంలో బహిర్భూమికి వెళ్లిన క్వారీ కార్మికుడు కూడా ఆ శబ్దానికి పరుగులు తీశాడు. అతడిచ్చిన సమాచారం కూడా పేలుడు జరిగిందనడానికి బలాన్ని చేకూర్చింది.
అయితే ఎలాంటి పేలుడు సంభవించలేదని క్వారీ నిర్వాహకులు వాదిస్తున్నారు. పేలుడు శబ్దం సుమారు 15 కి.మీ వరకు వినిపించింది. ఇళ్లలోని తలుపులు కూడా అదిరాయి. జిలిటెన్ స్టిక్స్ కొనుగోలు, వినయోగంపై అధికారులు సమాచారం సేకరించనున్నారు. మంగళవారం కూడా మరోసారి పరిశీలన చేయనున్నారు. పరిశీలనలో మైనింగ్ ఏడీ విష్ణువర్థనరెడ్డి, తహసీల్దారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని భూకంపం కేంద్రమని ప్రచారం చేసేందుకు పేలుడుకు కుట్ర పన్ని ఉంటారని రాజధాని గ్రామాల్లోని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతంలో ధర్నాలు చేసేందకు రాజధాని రైతులు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నట్లు తెలిసింది.