కేజీబీవీల్లో 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , First Publish Date - 2021-12-04T06:18:19+05:30 IST
జిల్లాలోని 37 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న 42 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.
కేజీబీవీల్లో 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
18న నియామకపు ఉత్తర్వులు
ఏపీసీ శ్రీనివాసరావు వెల్లడి
ఒంగోలు విద్య, డిసెంబరు 3 : జిల్లాలోని 37 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న 42 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయం లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అనుభవం, అర్హత, ఆసక్తి గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీనివా సరావు తెలిపారు. 6 ప్రిన్సిపాల్ పోస్టులు, 29 సీఆర్టీ పోస్టులు కాగా తెలుగు 2, హిందీ 1, ఇంగ్లీషు 3, మ్యాథ్స్ 7, ఫిజిక్స్ 3, ఎన్ఎస్ 6, ఎస్ఎస్ 2, పీఈటీ 5 ఉన్నా యి. అలాగే పీజీటీ 7 పోస్టులు కాగా.. అందులో తెలుగు 1, ఇంగ్లీషు 2, మ్యాథ్స్ 1, కెమిస్ర్టీ 2, జువాలజీ 1 పోస్టును భర్తీచేస్తున్నట్లు ఏపీసీ తెలిపారు. అభ్యర్థులకు ఎటు వంటి రాతపరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ప్రాతిపదికగానే ఎంపిక చేస్తారు. ఎంపిక కమిటీకి జేసీ(అభివృద్ధి) చైర్మన్గా, ఏపీసీ మెంబర్ కన్వీనర్గా, డీఈవో, ఏపీఎంఎస్ ఏడీ సభ్యులుగా ఉంటారు. ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తారు. ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసే వారు విద్యార్హతకు 40, వృత్తిపరమైన విద్యార్హతలకు 40, రెండేళ్ల అనుభవానికి 10, ఉన్నత విద్యార్హతలు, వృత్తిపరమైన అర్హతలకు ఐదేసి చొప్పున మొత్తం 100 మార్కులు ప్రామాణికంగా తీసుకుంటారు. అదేవిధంగా సీఆర్టీ, పీఈటీ పోస్టులకు విద్యార్హతలకు 30, వృతిపరంగా 30, టెట్కు 20, రెండేళ్ల అనుభవానికి 10, ఉన్నత విద్యకు 10 చొప్పున మొత్తం 100 మార్కులు ఇస్తారు.
8వ తేదీ వరకూ దరఖాస్తుల స్వీకరణ
కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి శనివారం నుంచి ఈనెల 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 9, 10 తేదీల్లో పరిశీలన, 11న మెరిట్ జాబితా, 11 నుంచి 14 వరకు జాబితాలపై అభ్యంతరాలు స్వీకరణ, పరిష్కారం ఉంటుంది. 16న తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. 18న కౌన్సెలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారు. దరఖాస్తులను స్థానిక సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో 8న సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని ఏపీసీ కోరారు. కార్యక్రమంలో సీఎంవో కొండారెడ్డి పాల్గొన్నారు.