గర్భిణులకు వంద శాతం వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-08-03T05:46:03+05:30 IST
కరోనా నేపథ్యంలో గర్భిణులకు వంద శాతం వ్యాక్సినేషన్కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.
- దిశ యాప్పై అవగాహన కల్పించాలి
- కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశాలు
కల్లూరు, ఆగస్టు 2: కరోనా నేపథ్యంలో గర్భిణులకు వంద శాతం వ్యాక్సినేషన్కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. సోమవారం కల్లూరు మండలం పెద్దపాడు, సల్కాపురం గ్రామాల సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు, మూమెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, స్పందన అర్జీల పరిష్కారం, ప్రభుత్వ పథకాల పోస్టర్లు డిస్ప్లే తదితర వాటిని పరిశీలించారు. ఎంతమందికి మొదటి డోసు, రెండో డోసు వ్యాక్సిన్ వేశారన్న దానిపై ఆరా తీశారు. దిశ యాప్పై గ్రామీణ ప్రాంతాల మహిళలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందుబాటులో ఉన్నాయా? లేదా? అని ఆరా తీశారు. అనంతరం రైతుల పంట నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు సేవలను పారదర్శకంగా అందించాలని ఆదేశించారు.
సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ కోటేశ్వరరావు
కర్నూలు(కలెక్టరేట్): ప్రజా సమస్యలు పరిష్కారానికి పెద్ద పీట వేయాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులకు పంపిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రాంసుందర్ రెడ్డి, డా.మనజీర్ జిలానీ సామూన్, ఎన్.మౌర్య, శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఆర్వో పుల్లయ్య, డీఆర్డీఏ పీడీ వెంకటేశులు, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.