మరి కొద్ది వారాల్లో వ్యాక్సిన్ రెడీ: మోదీ
ABN , First Publish Date - 2020-12-04T20:14:47+05:30 IST
రాబోయే కొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని నిపుణులు గట్టి నమ్మకంతో..
న్యూఢిల్లీ: రాబోయే కొద్ది వారాల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని నిపుణులు గట్టి నమ్మకంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని చెప్పారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, వయోవృద్ధులకు వ్యాక్సినేషన్లో తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. దేశంలోని కరోనా వైరస్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారంనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని చెప్పారు. 'ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్కు వ్యాక్సిన్ పంపిణీలో విశేషానుభవం, సామర్థ్యం ఉంది. వ్యాక్సినేషన్ రంగంలో అతిపెద్ద, అనుభవం కలిగిన నెట్వర్క్ ఉంది. వాటిని పూర్తిగా వినియోగించుకుంటాం' అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యాక్సిన్ ధరలపై రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరిపి, ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 10.30 గంటలకు అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ తరఫున రాజ్యసభలో ఆ పార్టీ విపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ మాట్లాడారు. టీఎంసీ నుంచి సుదీప్ బందోపాధ్యాయ్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, శివసేన నుంచి వినాయక్ రౌత్ తమ అభిప్రాయాలను సమావేశం దృష్టికి తెచ్చారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి.మురళీధరన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో కరోనా విజృంభించిన తర్వాత ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఇది రెండోసారి.