శాంతి చర్చలకు సమ్మతం
ABN , First Publish Date - 2022-02-28T08:30:00+05:30 IST
హెచ్చరికల స్థాయి దాటి.. ఉద్రిక్తతల వేడి పెరిగి.. తీవ్ర స్థాయిలో బాంబు దాడుల వరకు వచ్చి.. నగరాల స్వాధీనం దశకు చేరిన రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి వీచిక..! నాలుగు
- రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆదివారం మధ్యాహ్నం షురూ
కీవ్, ఫిబ్రవరి 27: హెచ్చరికల స్థాయి దాటి.. ఉద్రిక్తతల వేడి పెరిగి.. తీవ్ర స్థాయిలో బాంబు దాడుల వరకు వచ్చి.. నగరాల స్వాధీనం దశకు చేరిన రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి వీచిక..! నాలుగు రోజుల అల్లకల్లోల పరిస్థితుల నుంచి కాసింత ఉపశమనం కలిగించే శుభవార్త..! కయ్యానికి కాలు దువ్విన రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ సంసిద్ధత..! పొరుగు పెద్దన్నతో కూర్చుని మాట్లాడేందుకు తాము ఒప్పుకొంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్ కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం (భారత్లో రాత్రి 7గంటలకు) ఉక్రెయిన్కు ఉత్తరాన బెలారస్ సరిహద్దున ప్రిప్యాట్ నదీ తీర ప్రాంతంలో ఇరు దేశాల మధ్య చర్చలు మొదలైనట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు ఆంటన్ గెరాచెంకో ప్రకటించారు.
అయితే, ఈ వ్యవధిలో కొంత నాటకీయత చోటుచేసుకుంది. బెలార్సలోని గోమెల్ వేదికగా చర్చలకు రావాలని తొలుత రష్యా కోరగా ఉక్రెయిన్ నిరాకరించింది. రష్యా తమపై దాడులకు కేంద్రంగా వాడుకుంటున్న బెలార్సలో చర్చలను అంగీకరించేది లేదంటూ జెలెన్ స్కీ స్పష్టం చేశారు. ‘‘మాపై ఆయుధాల ప్రయోగానికి వేదిక కాని ఏ దేశంలోనైనా చర్చలకు సిద్ధం’’ అని అన్నారు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు దళాలను హై అలర్ట్ చేశారు. అణు బలగాలను ‘‘యుద్ధ విధుల్లో’’ ఉంచాలని రక్షణ మంత్రి, సైనిక జనరల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ను ఆదేశించారు. దీనికితోడు శనివారం రాత్రి రష్యా బలగాలు ఉక్రెయిన్లో పౌర ఆవాసాలపైనా దాడులకు దిగాయి. ఈ పరిణామాల అనంతరం జెలెన్స్కీ.. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోకు ఫోన్ చేసి, రష్యాతో చర్చలకు అంగీకరించారు. చర్చల సమయంలో బెలారస్ నుంచి ఉక్రెయిన్పై విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణి దాడులు ఉండవని లుకషెంకో హామీ ఇచ్చినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. పుతిన్ అణు బలగాలను హై అలర్ట్ చేయడంపై అమెరికా, నాటో మండిపడ్డాయి. యుద్ధాన్ని కొనసాగించాలనే ఈ ధోరణి అవాంఛనీయమని దుమ్మెత్తిపోశాయి. పుతిన్ ఆదేశాలు బాధ్యతారహితమని నాటో ప్రధాన కార్యదర్శి స్టోలెన్బర్గ్ పేర్కొన్నారు.
రష్యాలోని విదేశీ ఆస్తులను జాతీయం చేద్దాం: మెద్వెదేవ్
ఆంక్షల కత్తి ఝుళిపించిన పశ్చిమ దేశాలపై రష్యా ప్రతిచర్య అదే తరహాలో ఉండాలని.. ఆయా దేశాలకు చెందిన ఆస్తులను జాతీయం చేయడంతో పాటు, దౌత్య సంబంధాలను నిలిపివేయాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు, భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ ద్మిత్రీ మెద్వెదేవ్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారాయన. ‘‘ఈ అద్భుతమైన ఆంక్షలు.. దేన్నీ మార్చలేవు. రాజకీయ నపుంసకత్వం నుంచి, రష్యా మార్గాన్ని మార్చడం చేతగాని అసమర్థత నుంచి పుట్టుకొచ్చిన ఆంక్షలివి. అఫ్ఘాన్ నుంచి పిరికితనంతో పారిపోవాలన్న తమ సిగ్గుమాలిన నిర్ణయాలను సమర్థించుకోగలమన్న ఆశతో విధించిన ఆంక్షలు. వీటికి ప్రతిగా మాస్కో (రష్యా) ఆయా దేశాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ఆస్తులను జాతీయం చేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు.