రహదారుల పనులు పూర్తి చేయండి : మంత్రి నాని
ABN , First Publish Date - 2020-11-26T06:21:22+05:30 IST
అసంపూర్తిగా మిగిలిపోయిన రహదారుల పనులను నిధులు మురిగిపోకముందే పూర్తి చేయాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
మచిలీపట్నం టౌన్ : అసంపూర్తిగా మిగిలిపోయిన రహదారుల పనులను నిధులు మురిగిపోకముందే పూర్తి చేయాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. బుధవారం పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పేర్ని నాని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అనంతరం తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, నాడు-నేడు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, గ్రామ సచివాలయాల నిర్మాణ పనులకు ఉపాధి హామీ పథక నిధులతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో 809 గ్రామ సచివాలయాలు, 796 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రికి పరామర్శ
మంత్రి పేర్ని నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ మృతి నేపథ్యంలో మంత్రిని ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పురుషోత్తమ నాయుడు, జిల్లా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, కార్యదర్శి పి. సాయికుమార్, జిల్లా పరిషత్ ఎన్జీవోల సంఘ నాయకుడు దారపు శ్రీనివాస్ పరామర్శించారు. ఈనెల 29న మార్కెట్ యార్డులో నాగేశ్వరమ్మ సంతాప సభ జరుగుతుందని మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాదా తెలిపారు.