పన్నుల పేరుతో ప్రజలపై అదనపు భారం
ABN , First Publish Date - 2021-07-31T05:23:09+05:30 IST
పిఠాపురం, జూలై 30: కరోనా విపత్కర సమయంలో ప్రజలు ఉపాధి కోల్పోయి జీవనం సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో పన్నుల పేరుతో వారిపై అదనపు భారం మోపడంపై టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలో చైర్పర్సన్
పిఠాపురం కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఆగ్రహం
పిఠాపురం, జూలై 30: కరోనా విపత్కర సమయంలో ప్రజలు ఉపాధి కోల్పోయి జీవనం సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో పన్నుల పేరుతో వారిపై అదనపు భారం మోపడంపై టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలో చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం జరిగింది. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు, చెత్తసేకరణపై కొత్త గా పన్ను విధింపును టీడీపీ సభ్యులు వ్యతిరేకించారు. ఇప్పటికే ఉన్న పన్నులు చెల్లించలేని స్థితిలో ప్రజలు ఉన్నారని, ఇటువంటి తరుణంలో కొత్త పన్నులు విధించడం, ఉన్న వాటిని పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ తరుణంలో మునిసిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గండేపల్లి బాబీ మాట్లాడటంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు కమిషనర్ సమాధానం చెప్పాలని, కో-ఆప్షన్ సభ్యుడు మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ సభ్యుడు తలిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కో-ఆప్షన్ సభ్యునికి సలహాలు ఇచ్చే అవకాశం ఉందని, దానిని కాదనే హక్కు లేదన్నారు. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మ ధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను పెంపునకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇందుకు నిరసనగా టీడీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పన్నుల పెంపునకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు పచ్చిమళ్ల జ్యోతి, కొత్తపల్లి పద్మ, కమిషనర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.