పీఎం మిస్సింగ్ : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-05-13T21:19:28+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనిపించడం లేదని కాంగ్రెస్ నేత

పీఎం మిస్సింగ్ : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతో సహా ప్రధాని మోదీ కనిపించకుండాపోయారని, మనకు మిగిలినవి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, మోదీ ఫొటోలేనని వ్యాఖ్యానించారు. 


రాహుల్ గాంధీ ప్రతి రోజూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొంటున్న తీరుపై రాహుల్ తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తున్నారు. కోవిడ్ రోగులు ఆక్సిజన్, మందులు అందుబాటులో లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేసేందుకు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవని, కోవిడ్ రెండో ప్రభంజనంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


రాహుల్ గాంధీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతో సహా ప్రధాన మంత్రి కూడా కనిపించడం లేదు. ఇక మిగిలినవి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, మందులపై జీఎస్‌టీ, అక్కడా ఇక్కడా ప్రధాన మంత్రి ఫొటోలు మాత్రమే’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-13T21:19:28+05:30 IST