కోవిడ్ కొత్త వేరియంట్: మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
ABN , First Publish Date - 2021-11-27T22:47:28+05:30 IST
న్యూఢిల్లీ: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి
న్యూఢిల్లీ: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులతో పాటు ఒమిక్రాన్ కారణంగా తలెత్తబోయే పరిణామాలను అధికారులు ఆయనకు వివరించారు. ఒమిక్రాన్ బయటపడిన దక్షిణాఫ్రికాతో పాటు కేసులు వెలుగు చూస్తున్న ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే వారు అదనపు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. అంతేకాదు ఆయా దేశాలకు ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కోవిడ్పై పోరు కొనసాగించాలని సూచించారు. విమానాల రాకపోకలపై ఉన్న ఆంక్షలను తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు పున: సమీక్షించాలని ప్రధాని సూచించారు. సమావేశంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తదితరులు పాల్గొన్నారు.