పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే వ్యక్తి మోదీ : దీదీ ఫైర్

ABN , First Publish Date - 2021-02-24T22:32:40+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పెద్ద ఎత్తున అల్లర్లు

పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే వ్యక్తి మోదీ : దీదీ ఫైర్

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే వ్యక్తి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. హుగ్లీలోని షాన్‌గంజ్ సభలో ఆమె ప్రసంగించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ద్వయం విపరీతమైన అబద్ధాలను ప్రచారం చేస్తూ, దేశ వ్యాప్తంగా విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ అల్లర్లు సృష్టించే వ్యక్తి. అల్లర్ల ద్వారా ట్రంప్ సాధించిందేమి? అంతకంటే ఘోరమైన ఇబ్బందులను మోదీ ఎదుర్కొంటారు. హింస ద్వారా సాధించేది ఏమీ లేదు.’’ అని మమత వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తామే గోల్‌కీపర్లమని, బీజేపీ ఒక్క గోల్‌నూ సాధించలేదని ధీమా వ్యక్తం చేశారు.


బొగ్గు కుంభకోణంలో సీబీఐ ఎంపీ అభిషేక్ భార్యకు నోటీసులు జారీ చేయడమంటే మహిళలను అవమానించడమే అవుతుందని విమర్శించారు. ‘‘నన్ను చంపండి. కొట్టండి. అంతేగానీ మా కోడలిని అవమానపరుస్తారా? బొగ్గు దొంగ అని విమర్శిస్తారా? మమ్మల్ని బొగ్గు దొంగ అని పిలుస్తారా? మీరేమైనా మచ్చలేని వారా? మీ గురించి మాకన్నీ తెలుసు. కానీ అంత కింది స్థాయికి నేను దిగలేను.’’ అని ఘాటుగా విమర్శించారు మమత. దేశాన్ని బెంగాలీలతో పాటు ఇతరులు కూడా పాలించారని, ఇతరులు బెంగాలీల వెన్నెముకలను తుంచడానికి ప్రయత్నించాని విమర్శించారు. వారు బెంగాల్‌ను పాలించడానికి చూస్తున్నారని, బెంగాల్‌ను బెంగాల్ లాగా ఉంచాలని, బీజేపీ బెంగాల్‌ను ఏం చేయాలనుకుంటోందో చెప్పాలని ఘాటుగా నిలదీశారు. గుజరాతీలు బెంగాల్‌ను ఎన్నడూ పరిపాలించలేరని పరోక్షంగా మోదీ,షా ద్వయంపై ఆమె విరుచుకుపడ్డారు. 


బీజేపీని బెంగాల్‌లో ఓడగొడితే...

వచ్చే ఎన్నికల్లో బీజేపీని బెంగాల్‌లో చిత్తుచిత్తుగా ఓడగొడితే... దేశం నలుమూలలా బీజేపీని ఓడించడం అసాధ్యమేమీ కాదని మమత పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చాలా అభివృద్ధి పనులు చేశామని, మోదీ చేసిందేమో చెప్పాలని సవాల్ విసిరారు. తమను పాతిపెట్టినా సరే.... మళ్లీ చెట్టులా పెరుగుతూనే ఉంటానని ఆమె ప్రకటించారు. ‘‘నన్ను పాతిపెట్టినా చెట్టులా విస్తరిస్తూనే ఉంటా. ఆట మొదలైంది. గాయపడిన పులి చాలా ప్రమాదకారి. బెంగాల్‌లో బీజేపీని ఓడిస్తే.. భారత రాజకీయ చిత్ర పటంపై కనుమరుగవుతుంది. ఇది ఖాయం.’’ అని మమత ఓటర్లకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-02-24T22:32:40+05:30 IST