స్నేహితుని ఇంట్లో దాక్కున్న హంతకుణ్ణి పట్టుకున్న పోలీసులు.. విచారణలో అతను చెప్పిన విషయాలను వినగానే షాక్..
ABN , First Publish Date - 2021-11-22T16:28:57+05:30 IST
ఛత్తీస్గఢ్లోని రాయపూర్ పరిధిలో గల..
ఛత్తీస్గఢ్లోని రాయపూర్ పరిధిలో గల తిల్దా ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ ఉదంతంలో 29 ఏళ్ల హేమంత్ థృవ్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. హేమంత్ తమ ప్రాంతంలోనే ఉంటున్న సంజయ్ కండ్రా(22) అనే యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన నవంబరు 5న జరిగింది. తిల్దాలోని గోవర్థన్ నగర్ ప్రాంతంలో ఒక డాన్స్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో సంజయ్ కాండ్రా, హేమంత్ ధృవ్ పాల్గొని నృత్యం చేశారు.
ఈ సమయంలో సంజయ్ కాండ్రా.. హేమంత్ ధృవ్ను అనుకోకుండా ఢీకొన్నాడు. ఈ నేపధ్యంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అది ఒకరినొకరు కొట్టుకునేవరకూ దారి తీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన హేమంత్ అక్కడేవున్న ఒక పెద్ద బండరాయిని తీసుకుని సంజయ్ తలమీద, ఛాతీమీద గట్టిగా మోదాడు. ఈ దాడిలో సంజయ్ తీవ్రంగా గాయపడగా, నిందితుడు హేమంత్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్నేహితుని ఇంట్లో దాక్కున్న నిందితుడు హేమంత్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హేమంత్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. డాన్స్ చేస్తున్న సమయంలో తనను ఢీకొట్టాడనే కోపంతోనే సంజయ్ను హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.