యంత్రాంగం సిద్ధం
ABN , First Publish Date - 2021-04-21T04:22:49+05:30 IST
సెకెండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం అన్నివిధాలా సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. మంగళవారం జేసీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐదు ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మహారాజా జిల్లా ఆస్పత్రిలో 200 పడకలు, నెల్లిమర్ల మిమ్స్లో 800, విజయనగరం గాయత్రి ఆస్పత్రిలో 20, సాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 30, పార్వతీపురంలో ఏరియా ఆసుపత్రిలో 100 పడకలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
కలెక్టర్ హరిజవహర్లాల్
కలెక్టరేట్, ఏప్రిల్ 20: సెకెండ్ వేవ్ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం అన్నివిధాలా సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. మంగళవారం జేసీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐదు ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మహారాజా జిల్లా ఆస్పత్రిలో 200 పడకలు, నెల్లిమర్ల మిమ్స్లో 800, విజయనగరం గాయత్రి ఆస్పత్రిలో 20, సాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 30, పార్వతీపురంలో ఏరియా ఆసుపత్రిలో 100 పడకలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. చీపురుపల్లి సీహెచ్సీలో 15 పడకలు, ఎస్.కోట సీహోచ్సీలో 20 పడకలను బుధవారం ప్రారంభిస్తామన్నారు. శుక్రవారం మరికొన్ని ఆస్పత్రుల్లో సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. మిమ్స్లో అత్యాధునిక వైద్య పరికరాలు, ఆక్సిజన్ ట్యాంకర్ అందుబాటులో ఉన్న దృష్ట్యా అత్యవసర సేవలు అందించాలని ఆదేశించారు. వైరస్ నిర్థారణ పరీక్షలు, వైద్య సేవల కోసం అదనపు సిబ్బందిని నియమించాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాస్కు ధరించకుండా బయట తిరిగే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రూ.200, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.100 జరిమానా విధించాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే నెలలో గరిష్ట స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశమున్నందున ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. రోజుకు సగటున 4 వేల నిర్థారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. 24 గంటల్లో ఫలితాలు వెలువడేలా చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్ ప్రత్యేకాధికారి సత్యనారాయణ, జేసీలు కిషోర్ కుమార్, మహేష్ కుమార్, వెంకటరావు, డీఎంహెచ్వో రమణకుమారి, డీసీహెచ్వో నాగభూషణరావు, డీఆర్వో గణపతిరావు, డీపీవో సునీల్రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.