ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత
ABN , First Publish Date - 2021-01-21T05:54:56+05:30 IST
ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత అని ఈ మేరకు ప్రతిఒక్కరూ చొరవచూపాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. జిల్లా పర్యటనకు మంగళవారం రాత్రి కడప చేరుకున్న ఆయన ఆలంఖానపల్లెలోని యతిసేవాశ్రమంలో బసచేశారు.
త్రిదండి చిన్నజీయర్ స్వామి
పలు ఆలయాల సందర్శన
వల్లూరు / కడప (మారుతీనగర్) / ఒంటిమిట్ట / నందలూరు / సిద్దవటం, జనవరి 20: ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత అని ఈ మేరకు ప్రతిఒక్కరూ చొరవచూపాలని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. జిల్లా పర్యటనకు మంగళవారం రాత్రి కడప చేరుకున్న ఆయన ఆలంఖానపల్లెలోని యతిసేవాశ్రమంలో బసచేశారు. బుధవారం మధ్యాహ్నం నందలూరు మండలంలోని సౌమ్యనాథస్వామిని అహోబిళ పీఠాధిపతి రామాంజనేయస్వామితో కలసి దర్శించుకున్నారు. అలాగే ఒంటిమిట్ట కోదండరామాలయంలోని సీతారామలక్ష్మణులను దర్శించుకున్నారు. అక్కడి శాసనాలను పరిశీలించాక సిద్దవటం మండలం రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. సిద్దవటం కోటను సైతం పరిశీలించారు. వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. తదనంతరం తిరుమల తొలిగడపగా ఖ్యాతిగాంచిన దేవునికడప లక్ష్మీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడి శిల్ప సంపదను పరిశీలించారు. అన్ని చోట్లా ఆయనకు ఆలయ అర్చకులు, పాలకమండళ్లు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్న జీవయర్ స్వామి మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఆలయాలు బాగుండాలన్నారు. రాష్ట్రంలో విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించి శిక్షించాలన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్న దాడులను అరికట్టాలని, వాటిని తగ్గించేందుకే తాము ఆలయాలను సందర్శిస్తున్నామన్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక కనిపించని శక్తులేవో ఉన్నాయని వాటిని పూర్తిగా నిర్మించాలంటే ప్రజల్లో కూడా భక్తిభావం దైవచింతన పెరగాలన్నారు.