ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకుంటాం

ABN , First Publish Date - 2020-12-05T05:32:34+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను కాపాడుకోడానికి ఎంత వరకైనా పోరాడతామని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కార్మికులు స్పష్టం చేశారు.

ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకుంటాం
కేసీ కెనాల్‌లో జలదీక్ష చేస్తున్న ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు

  1. జలదీక్ష చేసిన కార్మికులు


నంద్యాల, డిసెంబరు 4: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూములను కాపాడుకోడానికి ఎంత వరకైనా పోరాడతామని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కార్మికులు స్పష్టం చేశారు. శుక్రవారం పరిశోధనా స్థానం ఆవరణలో ఉన్న కేసీకెనాల్‌ సబ్‌ చానల్‌లో వ్యవసాయ కార్మికులు జలదీక్ష చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ద్వారా రూ. వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చేదన్నారు. అలాంటి ఆర్‌ఏఆర్‌ఎస్‌ను రూపుమాపడానికి కుట్ర పన్నడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని అన్నారు. తాము వ్యవసాయకుటుం బాల నుంచి వచ్చామని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ప్రచారం చేసుకుంటూ రైతులు, కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిం చారు. వీరిద్దరికి ఎలా బుద్ధి చెప్పాలో నియోజకవర్గ ప్రజలు, రైతులు, కార్మికులు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములను బీడు భూము లని చెబుతూ కోర్టులను కూడా తప్పుదోవ పట్టించడం దుర్మార్గమని అన్నారు. వీరి దుష్టపన్నాగాలకు వ్యతిరేకంగా ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడుకోడానికి అన్ని వర్గాల ప్రజలు కదిలి రావాలని పిలుపు ఇచ్చారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మిక సంఘం నాయకులు, భారీ ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.


ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిరక్షణకు నేడు రైతు సదస్సు

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిరక్షణ కోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ శనివారం రైతు సదస్సును నిర్వహిస్తున్నట్లు సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన నంద్యాలలో మాట్లాడుతూ దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని వైద్య కళాశాల పేరుతో కేటాయించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకోవడానికి పోరాట కార్యాచరణను రైతు సదస్సులో నిర్ణయిస్తామని అన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ సెంటినరీ భవనంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిరక్షణ, తుఫాన్‌ వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం, పంటల బీమా, కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలు, చట్టబద్ధమైన కనీస మద్దతు ధర, రాజ్యాంగబద్ధ  వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీ ఏర్పాటు, కేసీకెనాల్‌కు ప్రపంచ వారసత్వ సాగునీటి నిర్మాణంగా గుర్తింపు, రాయలసీమ సాగునీటి అభివృద్ధి, వ్యవసాయ సంబంధిత పలు అంశాలపై రైతు సదస్సులో చర్చిస్తామని తెలిపారు. సదస్సుకు రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరు కావాలని కోరారు.

Updated Date - 2020-12-05T05:32:34+05:30 IST