నిరసన సెగ
ABN , First Publish Date - 2021-07-30T04:33:44+05:30 IST
ఎన్నికల సమయంలో మండల కేంద్రంలో జూనియర్ కళాఽశాల, ఊకచెట్టు వాగులో కాజ్వే ఏర్పాటు తదితర హామీలు నేటికీ అమలు చేయలేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి నిరసన సెగ తగిలింది.
ఎమ్మెల్యేలు ఆల, చిట్టెం వాహనాలను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
చిన్నచింతకుంట, జూలై 29 : ఎన్నికల సమయంలో మండల కేంద్రంలో జూనియర్ కళాఽశాల, ఊకచెట్టు వాగులో కాజ్వే ఏర్పాటు తదితర హామీలు నేటికీ అమలు చేయలేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. గురువారం మండల కేంద్రంలోని మద్దూరు గ్రామ సమీపంలో చెక్ డ్యాంకు జలపూజ నిర్వహించేందుకు వెళ్తున్న ఆయన వాహనాన్ని కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వాహనం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో నిరసనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరసన తెలిపిన వారిలో నాయకులు సంతోష్రెడ్డి, కో-ఆప్షన్ మైమూద్, బాలు, శేఖర్, ప్రతాప్, రషీద్, వెంకటేష్, శ్రీనివాసులుగౌడు, గౌస్, అక్బర్ ఉన్నారు.
నర్వ : మండల కేంద్రంలోని చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపల్లి, లక్కిడిదొడ్డి గ్రామాల్లో మట్టి రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడక్కడా తెగి పోయి రాకపోకలు నిలిచాయి. వీటి మరమ్మతులు చేయాలని తమ పార్టీ తరుపున వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడం సరి కాదన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరగడంతో ఎమ్మెల్యే వాహనం దిగివచ్చి మీరు చెబితేనే మేం చేస్తామా.. మాకు బాధ్యత లేదా.. అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న వారిలో కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, చెన్న య్య, వివేక్రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శరనప్ప, కట్ట రాములు ఉన్నారు.