బైక్ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు..

ABN , First Publish Date - 2020-05-19T16:44:26+05:30 IST

లాక్‌డౌన్‌ కాలంలో బైక్‌ ఇవ్వాల్సి రావడంపై భర్తతో జరిగిన ఘర్షణ ఓ గృహిణి ఆత్మహత్యకు దారి తీసింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సోం రాష్ట్రానికి చెందిన మిథున్‌దత్త, అనిదత్త(24)

బైక్ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ..  చివరకు..

బోయినపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : లాక్‌డౌన్‌ కాలంలో బైక్‌ ఇవ్వాల్సి రావడంపై భర్తతో జరిగిన ఘర్షణ ఓ గృహిణి ఆత్మహత్యకు దారి తీసింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సోం రాష్ట్రానికి చెందిన మిథున్‌దత్త, అనిదత్త(24) దంపతులు మూడేళ్ల క్రితం వలస కూలీలుగా నగరానికి వచ్చారు. మిథున్‌దత్త ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ నందమూరినగర్‌లో నివాసం ఉంటున్నారు. మిథున్‌ దత్త బైక్‌ను గ్రామంలో ఉన్న అనిదత్త అన్నయ్య వాడుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆ బైక్‌ మిథున్‌దత్త అన్నయ్యకు అవసరం పడింది.


ఆ బైక్‌ను తన అన్నయ్యకు ఇవ్వాలని మిథున్‌దత్త భార్యకు తెలిపాడు. దీనిపై వారం రోజులుగా భార్యా భర్తలు గొడవలు పడుతున్నారు. ఆదివారం రాత్రి గొడవ పెద్దది కావటంతో మనస్తాపానికి గురైన అనిదత్త ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకుంది. ఎంతసేపటికీ భార్య బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన భర్త లోనికి వెళ్లిచూడగా రాడ్‌కు వేలాడుతూ కనిపించింది. ఇరుగు, పొరుగు వారిని పిలిచి ఆమెను కిందకు దింపి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Updated Date - 2020-05-19T16:44:26+05:30 IST