రాహుల్ గాంధీ ‘సూడో ఎక్స్‌పర్ట్’ : ధర్మేంద్ర ప్రధాన్

ABN , First Publish Date - 2021-09-09T00:54:26+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలో డాంబికం పొంగిపొరలుతోందని

రాహుల్ గాంధీ ‘సూడో ఎక్స్‌పర్ట్’ : ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలో డాంబికం పొంగిపొరలుతోందని, తనకు లేని గుర్తింపును కోరుకుంటారని, ఆయన కుహనా నిపుణుడని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ - నీట్‌ నిర్వహణను వాయిదా వేయాలని గాంధీ డిమాండ్ చేయడంతో ప్రధాన్ ఈ విధంగా స్పందించారు. 


నీట్ షెడ్యూలుపై నిపుణులను, సుప్రీంకోర్టును తప్పుబట్టినందుకు రాహుల్ గాంధీపై ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం విరుచుకుపడ్డారు. ‘‘యువరాజు’’ తనకు అర్థం కాని విషయాలపై ప్రకటనలు ఇవ్వడం కన్నా, అబద్ధాలు సృష్టించడంలో తనకుగల నైపుణ్యానికి అంటిపెట్టుకుని ఉండాలన్నారు. 


సెప్టెంబరులో అనేక పరీక్షలు జరుగుతున్నాయని, నీట్ పరీక్షను వాయిదా వేయాలని రాహుల్ గాంధీ కోరారు. విద్యార్థుల ఇబ్బందుల పట్ల ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు. పరీక్షలు రాయడంలో విద్యార్థులకు న్యాయమైన అవకాశం లభించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 


ఇదిలావుండగా, నీట్ పరీక్షను వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన సంగతి తెలిసిందే. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీని సెప్టెంబరు 12న నిర్వహిస్తారు. 


Updated Date - 2021-09-09T00:54:26+05:30 IST