కేరళలో కోవిడ్ కేసులు ఆందోళనకరం : రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2021-07-30T20:52:45+05:30 IST
కేరళలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ : కేరళలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రజలను ట్విటర్ వేదికగా శుక్రవారం కోరారు. ఆయన కేరళలోని వయనాద్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్లో, కేరళలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. తగిన రక్షణ చర్యలు, మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కోవిడ్-19 కేసుల్లో 50 శాతం కేసులు (సుమారు 22,000) కేరళలోనే ఉన్నాయి. కేరళలో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి. గడచిన నాలుగు వారాల నుంచి 7 జిల్లాల్లో రోజువారీ నమోదవుతున్న కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈ మహమ్మారి మూడో ప్రభంజనం ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం జూలై 31న, ఆగస్టు 1న సంపూర్ణ అష్ట దిగ్బంధనం (లాక్డౌన్)ను ప్రకటించింది. ఇదిలావుండగా, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం డైరెక్టర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందాన్ని కేరళకు పంపిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఓ ట్వీట్ ద్వారా చెప్పారు.