పైలట్కు బుజ్జగింపు.. రంగంలోకి రాహుల్, ప్రియాంక
ABN , First Publish Date - 2020-07-13T23:48:10+05:30 IST
రాజస్థాన్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం పరిష్కారానికి కాంగ్రెస్ అగ్రనేతలు..
న్యూఢిల్లీ: రాజస్థాన్లో తలెత్తిన రాజకీయ సంక్షోభ పరిష్కారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. పైలట్ను నచ్చచెప్పి వెనక్కి (జైపూర్) పంపేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు చిదంబరం, కేసీ వేణుగోపాల్ తదితరులు రంగప్రవేశం చేశారు. ఎప్పటికప్పుడు పైలట్తో సంప్రదిస్తూ, ఏవైనా ఇబ్బందులుంటే జైపూర్లోనే ఉన్న పార్టీ పరిశీలకులతో మాట్లాడాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పైలట్తో పరిస్థితిని అడిగి తెలుసుకున్న అగ్రనేతలు.. జైపూర్ వచ్చి పరిశీలకులతో మాట్లాడాలని సూచించారు. ఇందుకు పైలట్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని వీరు చెబుతున్నారు. మరోవైపు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో ఆదివారం ఉదయం జరిగిన సీఎల్పీ సమావేశానికి సైతం పైలట్ హాజరుకాలేదు.
దీనిపై పార్టీ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, పార్టీలో ఎవరు అసంతృప్తికి గురైనా, పార్టీ నేతలతో సంప్రదిస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒక కుటుంబమని, కుటుంబంలో అసంతృప్తులు సహజమేనని అన్నారు. కుటుంబ సభ్యులంతా కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ సద్దుకుపోతాయని చెప్పారు. సచిన్తో సహా పార్టీ నేతలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తరఫున తాను ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నానని అన్నారు.