కాస్త ఊరట
ABN , First Publish Date - 2021-09-06T03:57:46+05:30 IST
కాస్త ఊరట
- జిల్లాలో వర్షం
- రణస్థలంలో అత్యధిక వర్షపాతం నమోదు
- పలాసలో అత్యల్పం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 5: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వర్షాభావ పరిస్థితులతో అల్లాడిపోతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. అత్యధికంగా రణస్థలం మండలంలో 96.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఎల్.ఎన్.పేట, పాతపట్నం, రేగిడి, హిరమండలం, పాలకొండ, సరుబుజ్జిలి, గార, బూర్జ, లావేరు, ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల్లో భారీగానే వర్షం కురిసింది. ఒకే మండలంలో వేర్వేరు గ్రామాల్లో కొన్నిచోట్ల అధికంగా, మరికొన్ని చోట్ల అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. కోటబొమ్మాళి మండలంలో కేవలం 0.5 మిల్లీమీటర్లు, పలాస మండలంలో 0.25 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం కురిసింది. వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చినవారు... వర్షం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు.
జిల్లాలో ఆదివారం నమోదైన వర్షపాతం :
----------------------------------------------------------
మండలం వర్షపాతం(మిల్లీమీటర్లలో)
----------------------------------------------------------
రణస్థలం 96.5
ఎల్.ఎన్.పేట 81.0
పాతపట్నం 70.25
రేగిడి 60.5
హిరమండలం 58.5
పాలకొండ 56.0
సరుబుజ్జిలి 52.0
గార 39.0
బూర్జ 33.5
లావేరు 33.0
ఆమదాలవలస 25.75
శ్రీకాకుళం 25.5
నరసన్నపేట 17.0
రాజాం 13.75
టెక్కలి 12.25
కొత్తూరు 11.25
వంగర 10.75
ఎచ్చెర్ల 10.25
శ్రీకాకుళం(రాగోలు) 9.75
మెళియాపుట్టి 8.25
మందస 4.0
సీతంపేట 4.0
ఇచ్ఛాపురం 3.25
జి.సిగడాం 3.25
సంతబొమ్మాళి 2.75
కవిటి 2.75
పొందూరు 2.5
సోంపేట 2.25
కోటబొమ్మాళి 0.5
పలాస 0.25
---------------------------------------------------
ఇంకా లోటే!
- జిల్లాలో తొమ్మిది శాతం తక్కువ వర్షపాతం
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
సిక్కోలును లోటు వర్షపాతం వెంటాడుతూనే ఉంది. అల్పపీడనాల ప్రభావంతో అడపాదడపా వర్షాలు కురిసినా.. ఇంకా తొమ్మిది శాతం లోటు వర్షపాతం ఉంది. భూగర్భ జలాలు, చిన్న నీటివనరులు రీఛార్జ్ కావాలి. అల్పపీడనాలు, నైరుతి రుతుపవనాల ప్రభావం జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఉంటుంది. ఈ ఏడాది జూన్లో 25 శాతం లోటు వర్షపాతం ఉండేది. జూలై, ఆగస్టులో కొంతమేర వర్షాలు కురవడంతో కాస్త ఊరట లభించింది. మూడు నెలల వ్యవధిలో జిల్లాలో 546.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, ఆదివారం వరకు 497.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇంకా 49.2 మిల్లీమీటర్లు (-9 శాతం) వర్షపాతం కురవాల్సి ఉంది. జూలైలో 189.4 మి.మీకు గానూ 191.9 మి.మీ వర్షం కురిసింది. 2.5 మి.మీ. అధికంగా నమోదైంది. ఆగస్టులో 185.1 మి.మీ.కు గానూ.. 180.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 4.3 మి.మీ వర్షపాతం తగ్గింది. ఈ నెలలో ఐదు రోజులకుగానూ 37.5 మి.మీ కురవాల్సి ఉండగా.. 43.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఐదు రోజుల్లో ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో కాస్త మెరుగుపడింది. ఇదే మాదిరి ఈ నెలలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే లోటు వర్షపాతం భర్తీ అవుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
మెరుగుపడని భూగర్భ జలాలు
అడపాదడపా వర్షాలు కురుస్తున్నా.. జిల్లాలో భూగర్భ జలాలు మెరుగుపడడం లేదు. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం మరింత లోతుకి జలాలు వెళ్లాయి. జిల్లాలో గత ఏడాది ఈ సమయానికి 5.07 మీటర్ల మేర భూగర్భ జలాలు లభించేవి. ఇప్పుడు 5.30 మీటర్ల లోతున ఉన్నాయి. అంటే 0.23 మీటర్ల మేర జలాలు లోతుకు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది మేలో 6.79 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేవి. ఆగస్టులో 5.30 మీటర్లకు జలం చేరింది. అప్పటికంటే ఫర్వాలేదు అనిపిస్తోంది. ఏదిఏమైనా పూర్తిస్థాయిలో వర్షాలు కురవకుంటే ఇబ్బందికర పరిస్థితేనని జిల్లావాసులు పేర్కొంటున్నారు.