కుటుంబసభ్యులు కరోనా రోగులను కలవచ్చు...
ABN , First Publish Date - 2020-09-19T11:54:39+05:30 IST
కరోనా రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు రాజస్థాన్ సర్కారు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది....
రాజస్థాన్ సర్కారు సంచలన నిర్ణయం
జైపూర్ (రాజస్థాన్): కరోనా రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు రాజస్థాన్ సర్కారు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలవవచ్చని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ప్రకటించారు. కరోనా రోగుల ఒంటరితనం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించేందుకు పీపీఈ కిట్, ఇతర రక్షణ పరికరాలు ధరించిన తర్వాత కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలిసేందుకు అనుమతిస్తున్నట్లు రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబసభ్యులు పీపీఈ కిట్, మాస్కు, గ్లౌజులు వంటి రక్షణ చర్యలు తీసుకొని ఆసుపత్రి నిర్ణయించిన సందర్శన సమయంలో అవసరమైన భౌతిక దూరం పాటిస్తూ కరోనా రోగులను కలవవచ్చని ఆరోగ్యశాఖ ఆదేశించింది. కరోనా రోగులను కుటుంబసభ్యులు కలవడమే కాకుండా వారికి ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా ఇవ్వవచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా ఆసుపత్రుల్లోని హెల్ప్ డెస్కుల వద్ద తగినన్ని వీల్ ఛైర్లు, స్ట్రెచర్లు, చిన్న ఆక్సిజన్ సిలిండర్లు ఉంచాలని రాజస్థాన్ ఆరోగ్యశాఖ ఆసుపత్రులను ఆదేశించింది.