భక్తిశ్రద్ధలతో రంజాన్‌

ABN , First Publish Date - 2020-05-26T05:36:07+05:30 IST

సోమవారం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో భక్తిశ్రద్ధలతో ముస్లింలు రంజాన్‌ వేడుకలు జరుపుకున్నారు

భక్తిశ్రద్ధలతో రంజాన్‌

ఇళ్లలోనే ముస్లింల ప్రార్థనలు 

భారీగా పోలీసు బందోబస్తు 


కరీంనగర్‌ కల్చరల్‌, మే 25: సోమవారం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో భక్తిశ్రద్ధలతో ముస్లింలు రంజాన్‌ వేడుకలు జరుపుకున్నారు. ఇళ్లలోనే ముస్లింలు తమ కుటుంబ సభ్యులతో కలిసి నిరాడంబరంగా ప్రార్థనలు చేశారు. కరోనా నేపథ్యంలో మసీదులు, ఈద్గాలకు ఎవరూ వెళ్లలేదు. మసీదుల్లో ప్రభుత్వ నిబంధనలకు లోబడి మౌజమ్‌, ఇమామ్‌లతో పాటు మరో నలుగురు మాత్రమే ప్రార్థనలు చేశారు. కరీంనగర్‌లో ముఖ్య ఈద్గాలైన పురానీఈద్గా, సాలెహ్‌నగర్‌, చింతకుంట, బైపాస్‌రోడ్‌ ఈద్గాలతో పాటు పలు మండల, గ్రామ కేంద్రాల్లో ఉన్న మసీదులు, ఈద్గాలు వెలవెలబోయి కనిపించాయి. మరోవైపు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.


పటిష్ఠ బందోబస్తు  

కరీంనగర్‌ క్రైం: రంజాన్‌ సందర్భంగా కమిషనరేట్‌ వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మసీదులు, స్మశాన వాటికలు, ఈద్గాల వద్ద ఎవరినీ అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. అడిషనల్‌ డీసీపీ జి చంద్రమోహన్‌ బందోబస్తును ప్రత్యక్షంగా పరిశీలించారు. బందోబస్తు కోసం 250మంది అధికారుల సేవలను వినియోగించారు. అడిషనల్‌ డీసీపీ నిబంధనలు పాటించి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా తమవంతు సహకారాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 


రాత్రిళ్లు కర్ఫ్యూ పటిష్ఠంగా అమలు చేస్తాం..పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి

రాత్రివేళల్లో కర్ఫ్యూను మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించే వారిపై చట్టపరంగా కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2020-05-26T05:36:07+05:30 IST