మసీదుల్లో రంజాన్ ప్రార్థనలు నిషేధం
ABN , First Publish Date - 2021-05-13T04:59:16+05:30 IST
ఈనెల 13, 14 తేదీల్లో నెలవంకను అనుసరించి మసీదులు, ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలనుకుంటున్న రంజాన్ ప్రార్థనలను నిషేధించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి.అరుణకుమారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అరుణకుమారి
కలెక్టరేట్, మే 12: ఈనెల 13, 14 తేదీల్లో నెలవంకను అనుసరించి మసీదులు, ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలనుకుంటున్న రంజాన్ ప్రార్థనలను నిషేధించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి.అరుణకుమారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జమాత్లో 50మందికి మించికుండా కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈద్ ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. ఇంటి వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఈద్ ప్రార్థనలను నిర్వహించడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు, చేతి తొడుగులు ధరించాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతోగాని, శానిటైజర్తో గానీ శుభ్రపరుచుకోవాలని సూచించారు. ఈద్గాలు, మసీదుల పరిసరాల్లో ఉమ్మి వేయరాదని, ముస్లిం సోదరులు ఆచరించే కరచాలనాలు, ఆలింగనాలకు ఈ ఏడాదికి విరామం ప్రకటించాలని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి మసీదులో ప్రవేశం నిషేధించాలని చెప్పారు. 65 సంవత్సరాలు పైబడిన వారు, గర్భిణులు, చిన్నపిల్లలు, హృద్రోగ సమస్యలు.. ఇతర దీర్ఘకాల సమస్యలు ఉన్నవారిని కూడా అనుమతించకూడదని తెలిపారు.