ముంబై, థానేలో రెడ్ అలర్ట్
ABN , First Publish Date - 2020-08-04T21:50:48+05:30 IST
భారీ వర్షాలకు ముంబై నగరం తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించింది.
ముంబై: భారీ వర్షాలకు ముంబై నగరం తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ముంబైతో పాటు థానే జిల్లా అస్తవ్యస్థంగా మారింది. రెండు రోజుల పాటు ముంబై నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముంబైతోపాటు థానేలో ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
చాలా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు రావడంతో జనం ఇబ్బంది పడ్డారు. కింగ్ సర్కిల్ వద్ద రెండు అడుగుల మేరకు నీరు నిలిచిపోయింది. గడిచిన 10 గంటల్లో ముంబై నగరంలో 230 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. అరేబియా మహాసముద్రంపై చురుకైన రుతుపవనాల కదలిక కారణంగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. భారీ వర్ష సూచన దృష్టిలో ఉంచుకుని అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం అన్ని కార్యాలయాలు, ఇతర సంస్థలను మూసివేశారు.