ప్రాథమిక స్థాయి నుంచే ప్రాంతీయ భాష
ABN , First Publish Date - 2021-03-04T07:13:29+05:30 IST
ప్రతిభావంతులైన యువతకు ఎల్లప్పుడూ అవకాశాలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. అంతరిక్షం, అణుశక్తి, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ప్రతిభ కలిగిన యువతకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని
అన్ని పాఠ్యాంశాలు స్థానిక భాషల్లో ఉండాలి
‘ఎన్ఈపీ’పై వెబినార్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ప్రతిభావంతులైన యువతకు ఎల్లప్పుడూ అవకాశాలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. అంతరిక్షం, అణుశక్తి, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ప్రతిభ కలిగిన యువతకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. కానీ, పరిశోధనలు, విజ్ఞానాన్ని పరిమితంగా వాడుతుండడం వల్లే దేశంలో అపార అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. విద్యా రంగంలో బడ్జెట్ కేటాయింపుల అమలుపై బుధవారం నిర్వహించిన వెబినార్లో ప్రధాని మోదీ మాట్లాడారు. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) స్థానిక భాషల వినియోగానికి పెద్దపీట వేసిందన్నారు. స్థానిక భాషల్లో బోధనకు ప్రాధాన్యమివ్వడం అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా అభివర్ణించారు. ప్రాథమిక నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ సమాచారాన్ని భారతీయ భాషల్లో అందించేందుకు విద్యావేత్తలు, నిపుణులు కృషి చేయాలని సూచించారు. వైద్య విద్య, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ లాంటివన్నీ ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందుబాటులోకి రావాలని, జాతీయ భాషా అనువాద మిషన్ ఇం దుకు దోహదపడుతుందని చెప్పారు. యువతకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఆత్మనిర్భర భారత్ను నిర్మించగలమన్నారు. మరోవైపు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మోదీ ట్విటర్లో వన్యప్రాణుల సంరక్షణకు పాటుపడుతున్న వారందరికీ శాల్యూట్ చేశారు.