దాడులను సహించం
ABN , First Publish Date - 2021-10-22T05:34:42+05:30 IST
టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులను సహించేదిలేదని టీడీపీ నేతలు హెచ్చరించారు.
- నిర్వీర్యమైన పోలీస్ వ్యవస్థ: టీడీపీ నేతలు
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 21: టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులను సహించేదిలేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్కుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పోలీసులను వైసీపీ కార్యకర్తలుగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. తమ నాయకుడు క్రమశిక్షణతో పార్టీని నడుపుతున్నారని చెప్పారు. సీఎం జగన్, డీజీపీలకు తెలిసే టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. పట్టాభి ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీస్స్టేషన్కు ఫోను చేస్తే వారు పట్టించుకోకపోవడం చూస్తే దాడి వెనుక కుట్ర దాగి వుందన్నారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ బంద్కు పిలుపునిస్తే తమను గృహ నిర్బంధాలకు గురిచేసిన పోలీసులు.. వైసీపీ నాయకులను రోడ్లుపై వదిలేశారని విమర్శించారు. తక్షణమే పోలీస్ శాఖను ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించి గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, మహిళా కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ద్వారా పార్వతిసుందరి, పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, కార్యదర్శి కడితి జోగరావు, మాజీ కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, రాచపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.