బెంగాల్లో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
ABN , First Publish Date - 2021-11-06T01:18:23+05:30 IST
పశ్చిమబెంగాల్లోని పూర్వ బర్దమాన్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ..
బర్దమాన్: పశ్చిమబెంగాల్లోని పూర్వ బర్దమాన్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దేవాండిగీ పోలీసు స్టేషన్ పరిధిలోని బర్దాన్-కట్వా రోడ్డుపై ఈ ప్రమాదం జరిగిందని, కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డ్రైవర్తో సహా 11 మంది కారులో ప్రయాణిస్తున్నారని, ప్రమాదం జరిగిన వెంటనే బర్దమాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తక్కిన ఆరుగురికి వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. వీరంతో కోల్కతాలోని డుమ్ డుమ్ విమానాశ్రయం నుంచి ముర్షీదాబాద్ జిల్లా సయద్పరికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. మృతులను రషీద్ షేక్ (61), సాయినుర్ ఖటూన్ (17), సోనాలి ఖటూన్ (9), ఆర్యన్ షేక్ (3), సయన్ షేక్ (3)గా గుర్తించి పోస్ట్మార్టానికి పంపినట్టు చెప్పారు. కాగా, ట్రక్కు ట్రైవర్ వాహనంతో పరారుకావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.