Hyderabad: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-11-14T17:28:15+05:30 IST
నగరంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇన్స్పెక్టర్ శ్రావణ్
హైదరాబాద్/తిరుమలగిరి: నగరంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్కు చెందిన లారెన్స్ లెన్నీ నోయల్(33) నీల్ బ్లూ ప్రైవేట్ లిమిటెడ్లో ఉద్యోగం చేస్తున్నాడు. దమ్మాయిగూడ నుంచి తన ద్విచక్ర వాహనం(రాయల్ ఎన్ఫీల్డ్)పై శనివారం తెల్లవారుజామున ఇంటికి బయలు దేరాడు. తిరుమలగిరి తిమ్మయ్య లైన్ మిలటరీ క్వార్టర్స్ వద్ద వాహనం స్లిప్ అయి రోడ్డు మీద పడిపోయాడు. తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. లారెన్స్ ఏదైనా వాహనానికి ఢీ కొట్టాడా లేక వెలుతురు లేక రహదారి గుంతలుగా ఉండడంతో జారి పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణం
జీడిమెట్ల: బైక్పై వేగంగా వెళ్తూ అదుపు తప్పి కిందపడటంతో తలకు తీవ్రమైన గాయమై యువకుడు అక్కడికక్కడే దుర్మణం చెందాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీ్సస్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. జగద్గిరిగుట్ట ప్రాంతంలోని షిర్డీహిల్స్లో నివాసముంటున్న శివశంకర్ కుమారుడు వినేష్(20) ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. శనివారం ఉదయం అల్వీన్కాలనీ నుంచి జగద్గిరిగుట్టవైపు తన పల్సర్ బైక్పై అతివేగంగా వెళ్తున్నాడు. నవీన్వైన్స్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి వినేష్ కిందపడ్డాడు. దీంతో అతని తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.