చంద్రబాబుకు కుర్చీపై ప్రేమ పోలేదు: రోజా
ABN , First Publish Date - 2020-02-28T10:59:12+05:30 IST
రాష్ట్ర ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు ఇంకా సీఎం కుర్చీపై ప్రేమ పోలేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. గురువారం ఆమె శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను
శ్రీశైలం, ఫిబ్రవరి 27: రాష్ట్ర ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు ఇంకా సీఎం కుర్చీపై ప్రేమ పోలేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. గురువారం ఆమె శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గ్గొన్నారు. మల్లన్న దర్శనార్థం వచ్చిన రోజాకు అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామికి అభిషేకం, భ్రమరాంబదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజల్లో, తులాభారం పూజల్లో రోజా పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం వద్ద గల ఆశీర్వచన మండపంలో ఎమ్మెల్యే రోజాను వేదపండితులు ఆశీర్వదించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎ్స.రామరావు స్వామివారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించి సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చానని, శివుడు అందర్నీ బాగా చూడాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ముఖ్యమంత్రికి బలాన్ని, ఆలోచన శక్తి, విజయాన్ని ప్రసాదించాలని కోరుకున్నానని అన్నారు. చంద్రబాబు, ఆయనకు సం బంధించిన వాళ్లు జగన్పై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రం అప్పుల్లో ఉం దని ప్రజలను మభ్యపెట్టారని, కానీ జగన్మోహన్రెడ్డి పేదల కష్టాలు తొలగించేలా ప్రతి జిల్లాలో ఒక్కో పథకాన్ని ప్రారంభిస్తూ ప్రజల మన్నన పొందుతున్నారని అన్నారు. అమ్మఒడి, మూడు రాజధానులు, దిశా చట్టంలాంటి వాటిని ఆదర్శంగా తీసుకొని పక్క రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు వయస్సు అయిపోయింది, దేవుని సే వలో ఆయన జీవితాన్ని గడిపితే బాగుంటుందని హితవు పలికారు.