ఉమ్మడి జిల్లాలో 22 రోడ్లకు రూ.112 కోట్లు మంజూరు
ABN , First Publish Date - 2020-08-12T11:03:06+05:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లాలో 170 కిలోమీటర్ల పొడవైన 22 రోడ్ల నిర్మాణానికి రూ.112 కోట్లు మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు
హవేళీఘణపూర్, ఆగస్టు 11 : ఉమ్మడి మెదక్ జిల్లాలో 170 కిలోమీటర్ల పొడవైన 22 రోడ్ల నిర్మాణానికి రూ.112 కోట్లు మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ముత్తాయిపల్లి నుంచి బూర్గుపల్లి వరకు రూ.3.46 కోట్లతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో రోడ్లను అద్దంలా తీర్చిదిద్దడానికి పుష్కలంగా నిధులు మంజూరు చేశామన్నారు. వెనకబడిన ప్రాంతాల్లో రవాణా సౌకర్యం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు.
మంజూరైన రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటున్నదని మత్రి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, ఈఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఈ జగదీశ్వర్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే, మంత్రి కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు తనను అవమానించారని బొగడభూపతిపూర్ సర్పంచ్ ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.