65 ప్రభుత్వ బడుల్లో సీబీఎస్ఈ?
ABN , First Publish Date - 2021-12-08T04:14:43+05:30 IST
జిల్లాలో 2021-22 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 7వతరగతి వరకు సీబీఎ్సఈ సిలబ్సను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
తొలివిడతగా ఎంపిక చేసిన అధికారులు
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
స్కూళ్ల ఎంపికపై జిల్లా అధికారుల కినుక
కనీస సమాచారం ఇవ్వలేదని విమర్శలు
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ధేశించిన నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో సీబీఎ్సఈ పాఠశాలలను రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తొలివిడతగా 65 పాఠశాలలను ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 2 ఎకరాల భూమి, పక్కాభవనాలు, 500 మంది విద్యార్ధులు దాటిన పాఠశాలలకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇవేమీ లేకుండానే అధికారులు పాఠశాలలను ఎంపిక చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరు (విద్య) డిసెంబరు 7 : జిల్లాలో 2021-22 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 7వతరగతి వరకు సీబీఎ్సఈ సిలబ్సను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికోసంగా రాష్ట్ర విద్యాశాఖాధికారులకు పాఠశాలలను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. తొలుత 7వ తరగతి వరకు నిర్వహించినా 2024 నాటికి పదోతరగతి వరకు పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో సంప్రదింపులు లేకుండానే 65 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో ఏపీ మోడల్ స్కూల్స్ 10, ఏపీఆర్ఈఐ సొసైటీ స్కూల్స్ 6, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు 5, ట్రైబుల్ వెల్ఫేర్ పాఠశాలలు 15, కేజీబీవీ స్కూల్స్ 10, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ 13, జడ్పీ పాఠశాలలు 9, మున్సిపల్ పాఠశాలలు 2 ఉన్నాయి. అయితే ఎంపిక చేసిన వాటిలో కొన్ని పాఠశాలల్లోనే భూమి, భవనాలు, విద్యార్థులు ఉన్నారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన జడ్పీ పాఠశాలల్లో కనీసం వందమంది విద్యార్థులు కూడా లేరని, పక్కా భవన నిర్మాణాలు సైతం పూర్తి చేయలేదని తెలిపారు. దీనికి తోడు పాఠశాలల ఎంపిక సమయంలో కనీసం తమను ఎవరూ సంప్రదించలేదని, రాష్ట్ర అధికారులే ఇష్టానుసారంగా వీటిని ఎంపిక చేశారని చెప్పడం విశేషం.
అమలు సాధ్యమేనా!?
పాఠశాలల్లో బోధనా విధానం సమూలంగా మార్పుచేయాల్సి ఉండటంతో సీబీఎ్సఈ సిలబస్ అమలు సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పాఠశాలల్లో తొలుత 7వతరగతి వరకు నిర్వహించినా ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుకుంటూ ఇంటర్ వరకు పూర్తిస్థాయిలో భవన నిర్మాణాలు, తరగతి గదులను సిద్ధం చేయాలి. విద్యాలయాల పర్యవేక్షణ నేరుగా సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పరధిలో ఉండడంతో పాటు కేంద్రస్థాయిలో జరిగే పోటీపరీక్షలకు అనుగుణంగా విద్యార్థులను ముందు నుంచే సన్నద్దం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జరుగుతున్న మూస పద్ధతి బోధన స్థానంలో ఆలోచన, సృజనాత్మకత, విశ్లేషణ స్థాయి పెంచాల్సి ఉంటుంది. ప్రధానంగా సబ్జెక్ట్ నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయ సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా కంప్యూటర్, సైన్స్ ప్రయోగశాలలు పక్కాగా ఏర్పాట్లు చేయాలి. వీటన్నింటికీ ప్రత్యేక నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకాలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోట్లాదిరూపాయలతో నాడు-నేడు పనులు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో నిధులు విడుదల కాక, పనులు పూర్తికాక విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక, అసంపూర్తి పనుల నడుమ తరగతులు నిర్వహించలేక పడే బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఈ తరుణంలో తాజాగా సీబీఎ్సఈ ఏర్పాట్ల నిర్వహణపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతుండగా, విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.