బహుజనులు రాజ్యాధికారం దిశగా సాగాలి
ABN , First Publish Date - 2021-11-27T06:43:08+05:30 IST
దేశంలో ప్రస్తుతం రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరడంలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర బహుజనులు రాజ్యాధికారం దిశగా సాగినప్పుడే రాజ్యాంగం సక్రమంగా అమలవుతుందని మాజీ ఐఏఎస్ అధికారి జేబీ రాజు అన్నారు.
- రాజమహేంద్రవరంలో ‘రాజ్యాంగ దినోత్సవ’ సెమినార్లో వక్తలు
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 26 : దేశంలో ప్రస్తుతం రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరడంలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర బహుజనులు రాజ్యాధికారం దిశగా సాగినప్పుడే రాజ్యాంగం సక్రమంగా అమలవుతుందని మాజీ ఐఏఎస్ అధికారి జేబీ రాజు అన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో పొందుపర్చిన సెక్యులర్, సోషల్ జస్టిస్ వంటి అంశాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని ఏపీఎస్ఈబీ గెస్ట్హౌస్లో 72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాయిస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఎంపవర్మెంట్, మూల్నివాసీ కర్మచారీ కల్యాణ్ మహాసంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఓఎన్జీసీ మాజీ అసెట్ మేనేజర్ డీఎంఆర్ శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో జేబీ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే మార్చి వేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు వారికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి బహుజనులంతా చైతన్యవంతం కావాలన్నారు. ఎంఎస్ఎంఈ అధికారి ఏవీ పటేల్, బాస్ ఎడిటర్ ఎన్ విద్యాసాగర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం నేత సానబోయిన రామారావు, ఎంకేకేఎం జాతీయ కార్యదర్శి కె తిలక్కుమార్, బహుజన కెరటాలు ఎడిటర్ పల్నాటి శ్రీరాములు, సీహెచ్ సుబ్బారావు, మోహన్కుమార్ ధర్మ, సుధాకర్ మాట్లాడారు. బుద్ధుడు, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.