నిబంధనల అమలు నిష్పాక్షికం : ట్విటర్

ABN , First Publish Date - 2021-08-12T19:59:24+05:30 IST

నిబంధనలను అందరికీ సమానంగా, నిష్పాక్షికంగా వర్తింపజేస్తున్నట్లు

నిబంధనల అమలు నిష్పాక్షికం : ట్విటర్

న్యూఢిల్లీ : నిబంధనలను అందరికీ సమానంగా, నిష్పాక్షికంగా వర్తింపజేస్తున్నట్లు ట్విటర్ తెలిపింది. కాంగ్రెస్ నేతల ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయడంపై వస్తున్న ఆరోపణలపై గురువారం స్పందించింది. తన వేదికపై అందరికీ సమానంగా నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. 


నిబంధనలను ఉల్లంఘించినవారిపై ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టడం కొనసాగిస్తామని ట్విటర్ అధికార ప్రతినిధి గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ‘‘మా సేవలను వినియోగించుకునే ప్రతి ఒక్కరికీ నిబంధనలను వివేకవంతంగా, నిష్పాక్షికంగా అమలు చేస్తాం. మా నిబంధనలను ఉల్లంఘించే చిత్రాలను పోస్ట్ చేసిన వందలాది ట్వీట్లపై ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకున్నాం. మా విస్తృత విధానాలకు అనుగుణంగా ఈ విధంగా చర్యలు తీసుకోవడాన్ని ఇకపై కూడా కొనసాగిస్తాం. కొన్ని రకాల ప్రైవేటు సమాచారం ఇతర సమాచారం కన్నా ఎక్కువ రిస్క్‌ను కలిగియుండవచ్చు, వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, భద్రతలను పరిరక్షించడమే ఎల్లప్పుడూ మా లక్ష్యం. ట్విటర్ రూల్స్‌ను అందరూ తెలుసుకోవాలి. ఏదైనా ఉల్లంఘన ఉన్నట్లు విశ్వసిస్తే, దానిని మాకు తెలియజేయండి’’ అని పేర్కొన్నారు. 


లైంగిక దాడి కేసులో ఆరోపిత బాధితురాలి (ఓ మైనర్ బాలిక) తల్లిదండ్రుల వివరాలను వెల్లడించినట్లు నిర్దిష్టంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) తమకు తెలియజేసిందని పేర్కొన్నారు. అందుకే కొన్ని ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపారు. తాము ట్విటర్ నిబంధనలు, విధానాల ఆధారంగా సమీక్షించామని, అదేవిధంగా భారత దేశ చట్టాల ప్రకారం వ్యక్తమైన ఆందోళనలను కూడా పరిశీలించామని తెలిపారు. హెల్ప్ సెంటర్‌లో వివరించినట్లుగా, ట్విటర్ రూల్స్‌కు విరుద్ధంగా ఏదైనా ట్వీట్ ఉన్నట్లు గుర్తిస్తే, దానిని అకౌంట్ హోల్డర్ డిలీట్ చేసే వరకు, దానిని తాము ఓ నోటీసు వెనుక మరుగుపరుస్తామని చెప్పారు. ఆ ట్వీట్‌ను తొలగించే వరకు లేదా అపీలు విజయవంతంగా ప్రాసెస్ అయ్యే వరకు ఆ ఖాతాను లాక్ చేస్తామన్నారు. 


నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ సహా మరికొందరు పార్టీ సీనియర్ నేతల అధికారిక ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసింది. దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తా మాట్లాడుతూ, ప్రజల గళాన్ని వినిపించడం నుంచి తమ పార్టీని ఎవరూ నిరోధించలేరని చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా దాదాపు 5,000 మంది పార్టీ నేతల ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసిందన్నారు. 


ఢిల్లీలో తొమ్మిదేళ్ళ బాలికపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కేసు నమోదైంది. బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ ఈ నెల 4న పరామర్శించి, న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫొటోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-08-12T19:59:24+05:30 IST