రుణమిచ్చి ఇళ్ల నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నాం
ABN , First Publish Date - 2021-08-04T05:03:10+05:30 IST
ఇళ్లపట్టాలు పొందిన ప్రతి లబ్ధిదారుకి వెలుగు ద్వారా రుణం ఇచ్చి నిర్మాణాలు చేసుకునేలా ప్రోత్సహి స్తున్నామని ఐసీడీఎస్ పీడీ, సర్వేపల్లి నియోజకవర్గ ప్రత్యేకాధికారి కే. రోజ్మాండ్ అన్నారు
సర్వేపల్లి నియోజకవర్గ ప్రత్యేకాధికారి రోజ్మాండ్
మనుబోలు, ఆగస్టు 3: ఇళ్లపట్టాలు పొందిన ప్రతి లబ్ధిదారుకి వెలుగు ద్వారా రుణం ఇచ్చి నిర్మాణాలు చేసుకునేలా ప్రోత్సహి స్తున్నామని ఐసీడీఎస్ పీడీ, సర్వేపల్లి నియోజకవర్గ ప్రత్యేకాధికారి కే. రోజ్మాండ్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వారంలో రెండు రోజులు ఇళ్ల పురోగతిపై సమీక్ష జరుపుతున్నామన్నారు. రెండో విడత కింద సర్వేపల్లికి 6,302 ఇళ్లు మంజూరు చేశారన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో మొదటి విడతలో మంజూరైన ఇళ్లలో 51 ఆర్ఎల్, 49ఇళ్లు రూప్ లెవల్, 3,671 ఇళ్లు బీపీఎల్ స్థాయిల్లో ఉన్నాయన్నారు. ప్రతి లబ్ధిదారుడికి వెలుగు ద్వారా రూ. 10వేల నుంచి 20వేల లోపు ముందుగా రుణం మంజూరు చేయిస్తున్నామన్నారు. దాంతో ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే తర్వాత గృహనిర్మాణ శాఖ ద్వారా బిల్లులు ఇవ్వబడతాయన్నారు. తర్వాత నిర్మాణాల వేగం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ప్రదీప్కుమార్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం శైలజ, హౌసింగ్ డీఈ. వరప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కార్తీక్రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ శరత్, సుదాకర్ పాల్గొన్నారు.