అఖిలేశ్కు ‘ప్రాంతీయ’ మద్దతు!
ABN , First Publish Date - 2022-01-15T08:05:44+05:30 IST
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్కు దేశంలోని బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నుంచి రాజకీయ, నైతిక మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తమ పార్టీతో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ యూపీలో పొత్తు కుదుర్చుకున్నాయని ఆ పార్టీ వర్గాలు..
- ఇప్పటికే సమాజ్వాదీ పార్టీతో తృణమూల్, ఎన్సీపీ పొత్తు
- ప్రచారానికి ‘ప్రాంతీయ’ నేతలు
- త్వరలో ఢిల్లీకి ముఖ్యమంత్రులు స్టాలిన్, కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే?
- మమత, పవార్తో కార్యాచరణ!
న్యూఢిల్లీ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్కు దేశంలోని బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నుంచి రాజకీయ, నైతిక మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తమ పార్టీతో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ యూపీలో పొత్తు కుదుర్చుకున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బులంద్ షహర్ జిల్లాలోని అనూప్ షహర్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థి కేకే శర్మ, మీర్జాపూర్ నుంచి తృణమూల్ అభ్యర్థి లలితేశ్ ప్రతాప్ త్రిపాఠీ పోటీ చేస్తున్నారని ఎస్పీ నాయకుడొకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అలాగే, ఆర్జేడీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఆర్ఎస్, శివసేన నాయకత్వం కూడా అఖిలేశ్కు మద్దతు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. నిజానికి, ఈ ఎన్నికల్లో అఖిలేశ్కు మద్దతుగా ప్రచారం చేస్తామన్న ప్రతిపాదన పది ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చినా.. అఖిలేశ్ ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రచారం ఊపందుకునే సమయంలో ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో కూడా అఖిలేశ్ ప్రచారం చేయించవచ్చని ఎస్పీ వర్గాలు తెలిపాయి.
యూపీలో బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగితే అఖిలేశ్ ఒంటరిగా ప్రచారం చేయాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో, ఇతర పార్టీల నేతలను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందన్న విషయంపై చర్చ జరుగుతోందని ఆ వర్గాలు వివరించాయి. కాగా, మరో వారం, పది రోజుల్లో తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు స్టాలిన్, కేసీఆర్, ఉద్దవ్ ఠాక్రే ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, శరద్ పవార్, మమతా బెనర్జీ తదితరులతో కలిసి వారు కార్యాచరణ రూపొందించే అవకాశాలున్నాయని ఈ వర్గాలు తెలిపాయి. కాగా, ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీకి మద్దతుగా టీఆర్ఎస్ అక్కడ ప్రచారం చేసే ఆలోచన ఉందా అని ‘ఆస్క్ కేటీఆర్’ సందర్భంగా శుక్రవారం ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం.