ఉమెన్ వాటర్ చాంపియన్ పారేశమ్మకు సంకల్ప్ తార అవార్డు
ABN , First Publish Date - 2021-12-01T05:36:05+05:30 IST
ఉమెన్ వాటర్ చాంపియన్ పారేశమ్మకు మరో అవార్డు లభించింది. హైదరాబాద్కు చెందిన సుచిరిండియా సంస్థ సంకల్ప్ తార అవార్డు అందించి సత్కరించింది.
తంబళ్లపల్లె, నవంబరు 30: ఉమెన్ వాటర్ చాంపియన్ పారేశమ్మకు మరో అవార్డు లభించింది. హైదరాబాద్కు చెందిన సుచిరిండియా సంస్థ సంకల్ప్ తార అవార్డు అందించి సత్కరించింది. సుచిరిండియా సంస్థ... యేటా నవంబరు 28న సంకల్ప్ దివస్ పేరుతో సంస్థ అధినేత వై.కిరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ర్టాల్లో సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారిని గుర్తించి సంకల్ప్ తార అవార్డులను అందిస్తోంది. ఈ ఏడాదికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల నుంచి వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న 25మందిని గుర్తించి అవార్డులను అందించింది. వీరిలో యుఎన్డీపీ నుంచి ఉమెన్ వాటర్ చాంపియన్ అవార్డు అందుకున్న పారేశమ్మ సంకల్ప్ తార అవార్డును అందుకుంది. ఎఫ్ఈఎస్ సంస్థలో రిసోర్స్గా పనిచేస్తున్న పారేశమ్మ కరువు ప్రాంతమైన తంబళ్లపల్లె మండలంలో నీటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుస్థిర వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, తక్కువ నీటి వనరులతో చిరుధాన్యాల సాగు చేపట్టేలా చైతన్య పరిచింది. ఆమె కృషికి గుర్తింపుగా ఈ ఏడాది జూలైలో ఐకరాజ్యసమితి, జాతీయ వాటర్ మిషన్ సంయుక్తంగా ఉమెన్ వాటర్ చాంపియన్ అవార్డును అందించాయి. ఈ అవార్డును అందుకున్న పారేశమ్మ సేవలను గుర్తించిన సుచిరిండియా సంస్థ గత ఆదివారం 28న హైదరాబాదులోని రవీంద్రభారతిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రమఖ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి చేతుల మీదుగా అవార్డుతో పాటు, రూ.15 వేల చెక్కును అందించారు.