నీళ్లల్లో చిక్కుకున్న22మందిని రక్షించిన అధికారులు
ABN , First Publish Date - 2020-11-28T05:38:35+05:30 IST
రెండురోజుల పాటు విపరీతంగా కురిసిన వర్షంతో పోటెత్తిన చక్రాలమడుగులో చిక్కుకున్న 22 మందిని పోలీసులు రక్షించారు.
రక్షణ చర్యల్లో పాల్గొన్న ఎస్పీ అన్బురాజన్
శాంతించిన గుంజనేరు, పుల్లంగేరు, చక్రాలమడుగు
రాజంపేట, నవంబరు 27: రెండురోజుల పాటు విపరీతంగా కురిసిన వర్షంతో పోటెత్తిన చక్రాలమడుగులో చిక్కుకున్న 22 మందిని పోలీసులు రక్షించారు. రక్షణ చర్యల్లో స్వయంగా ఎస్పీ పాల్గొన్నారు. వివరాలిలా.. విద్యుత్ వైర్లను పునరుద్ధరించడానికి గురువారం ఉదయం ఊటుకూరు చక్రాలమడుగు వాగులోని పొలాల వద్దకు వెళ్లిన 8మంది విద్యుత్ శాఖ సిబ్బంది వరద ఉధృతికి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరితో పాటు పొలాల్లో కాపలా కాస్తున్న మరో 14మంది అక్కడే ఉండిపోయారు. శుక్రవారం ఎస్పీ అన్బురాజన్ ఊటుకూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు 11వ బెటాలియన్ కమాండెంటు శ్రీనివాసులు, ట్రాన్స్-కో ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ చంద్రశేఖర్రావు, డీఎస్పీ శివభాస్కర్రెడ్డి, ఏడీ యుగంధర్, తహసీల్దారు రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్ సభ్యులు, ఫైర్ సిబ్బంది కలిసి ప్రత్యేక బోట్లు తీసుకొని నీళ్లలో అటు వైపు చేరుకున్నారు. అక్కడ షెడ్డులో తలదాచుకున్న రాజంపేట రూరల్ ఎలక్ట్రికల్ ఏఈ షఫీతో పాటు 8మంది సిబ్బందిని, నది మధ్యలో పంట పొలాల్లో కాపలాకాసే 14మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా కడప-చెన్నై రహదారిలో చక్రాలమడుగు వద్ద హైవేపై వరద నీరు తగ్గడంతో రాకపోకలను పునరుద్ధరించారు. తిరుపతి, చెన్నై ప్రాంతాలకు యధావిధిగా వాహనాలు నడిచాయి. కోడూరు, చిట్వేలి, పెనగలూరు మీదుగా ప్రవహించే గుంజనేరుకు వరదనీరు తగ్గింది. శుక్రవారం ఉదయం నుంచి చిరుజల్లులు మినహా భారీ వర్షాలు తగ్గిపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.