రైల్వేలో సెకండ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లు

ABN , First Publish Date - 2021-03-04T07:11:08+05:30 IST

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ క్లాస్‌లో త్వరలో ఏసీ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అన్‌రిజర్వ్‌డ్‌ సెకండ్‌ క్లాస్‌ జనరల్‌ కోచ్‌లలోనూ శీతల ప్రయాణానికి భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది.

రైల్వేలో సెకండ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లు

కపుర్తల కోచ్‌ ఫ్యాక్టరీలో తయారీ

రైల్వే బోర్డు ఆమోదమే తరువాయి


న్యూఢిల్లీ, మార్చి 3: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ క్లాస్‌లో త్వరలో ఏసీ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అన్‌రిజర్వ్‌డ్‌ సెకండ్‌ క్లాస్‌ జనరల్‌ కోచ్‌లలోనూ శీతల ప్రయాణానికి భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. కపుర్తలలోని రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేయనున్నారు. ఈ కోచ్‌ల బ్లూప్రింట్‌ ఇప్పటికే సిద్ధమైనా.. రైల్వే బోర్డు నుంచి అనుమతి రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. డిసెంబరులోగా సెకండ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లు సిద్ధమవుతాయని ఆర్‌సీఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రవీందర్‌ గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ కోచ్‌లలో వంద మందికి సరిపడా సౌకర్యాలున్నాయి. సెకండ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లో మరిందరికి ప్రయాణావకాశం కల్పిస్తామని ఆయన వివరించారు. సాధారణ స్లీపర్‌ కోచ్‌ తయారీకి రూ.2.24 కోట్ల ఖర్చవుతుందని, ఇవి గంటకు 110 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా తయారు చేసినవని చెబుతున్నారు. సెకండ్‌ ఏసీ స్లీపర్‌ కోచ్‌లు గంటకు 130 కిలోమీటర్ల వేగానికి అనుకూలంగా ఉంటాయంటున్నారు. అన్‌రిజర్వ్‌డ్‌ సెకండ్‌ క్లాస్‌ జనరల్‌ కోచ్‌లలోనూ ఏసీని పరిచయం చేయనున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే 3-టైర్‌ ఏసీలో ఎకానమీ కోచ్‌లను ఆర్పీఎఫ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, రైల్వేస్టేషన్లలో విశ్రాంతి గదుల్ని తెరవాలా లేదా అన్నదానిపై తుది నిర్ణయాన్ని ఆయా జోన్ల అధికారులే తీసుకుంటారని రైల్వే శాఖ తాజాగా పేర్కొంది.

Updated Date - 2021-03-04T07:11:08+05:30 IST