సెకండ్ వేవ్ ఎఫెక్ట్... ఆ ఔషధం ఎగుమతిపై నిషేధం...
ABN , First Publish Date - 2021-04-11T23:54:51+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో భారత
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఈ మహమ్మారి తీవ్రత తగ్గే వరకు రెమ్డెసివిర్ డ్రగ్, ఇంజెక్షన్ల ఎగుమతిని నిషేధించింది. ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది.
మన దేశంలో కోవిడ్ కేసులు ఇటీవల పెరుగుతున్నాయని ఈ ప్రకటన పేర్కొంది. ఈ నెల 11నాటికి దేశవ్యాప్తంగా 11.08 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోవిడ్ రోగులకు చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగిందని తెలిపింది. రాబోయే రోజుల్లో రెమ్డెసివిర్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
రెమ్డెసివిర్ ఉత్పత్తిని పెంచడం కోసం, దాని ఉత్పత్తిదారులతో ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్ చర్చిస్తోందని తెలిపింది. ఈ కంపెనీలు తమ స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల వివరాలను తమ వెబ్సైట్లలో పెట్టాలని పేర్కొంది. రెమ్డెసివిర్ స్టాక్స్ను తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లను, ఇతర అధికారులను ఆదేశించింది. రెమ్డెసివిర్ అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్ నిరోధం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కోవిడ్-19 రోగులకు చికిత్సలో రెమ్డెసివిర్ చాలా ముఖ్యమైన యాంటీ వైరల్ ఔషధం. ముఖ్యంగా రోగ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి దీనిని ఉపయోగిస్తారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను భారత దేశంలో ఏడు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్తో వాలంటరీ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రకారం ఈ కంపెనీలు దీనిని ఉత్పత్తి చేస్తున్నాయి.