నిర్వాసితులందరికీ పరిహారం అందేలా చూస్తా
ABN , First Publish Date - 2021-01-17T05:41:48+05:30 IST
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు స్పష్టం చేశారు.
గ్రామసభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు హామీ
తొగుట, జనవరి 16 : మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు స్పష్టం చేశారు. శనివారం మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన పల్లెపహాడ్, రాంపూర్, వడ్డెర కాలనీల్లో ఆయన పర్యటించి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో మాట్లాడారు. తమకు రావాల్సిన పరిహారం ఇంకా అందలేదని వారు లిఖిత పూర్వకంగా ఎమ్మెల్యేకు విన్నవించారు. అర్హులందరికీ పదిరోజుల్లో పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతిఒక్కరి విజ్ఞప్తులను రెవెన్యూ అధికారులతో పాటు, ఆయన కూడా నోట్ చేసుకున్నారు. రాంపూర్ గ్రామస్థులను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించగా వారు తమ గ్రామాన్ని సెపరేట్ గ్రామపంచాయతీగా గుర్తించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాల్రెడ్డి, ఆర్ఐ రవీందర్, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.