నిత్యావసరాలను బ్లాక్ చేస్తే ఏడేళ్లు జైలు
ABN , First Publish Date - 2020-04-09T07:32:33+05:30 IST
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులను బ్లాక్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్భల్లా ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం అన్ని రాష్ట్రాలు...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులను బ్లాక్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్భల్లా ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. నిత్యావసర వస్తువుల (ఈసీ) చట్టం మేరకు నల్లబజారు వ్యాపారులకు ఏడేళ్లదాకా జైలు శిక్ష విధించవచ్చని గుర్తుచేశారు. నిత్యావసర వస్తువలకు ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ఆ లేఖల్లో కోరారు.
కృత్రిమ కొరతను నివారించేందుకు జూన్ 30 వరకు ఈసీ చట్టాన్ని ప్రయోగించాలని.. నిల్వల పరిమితులను, ధరలను నిర్ణయించాలని సూచించారు. ఉత్పత్తిని పెంచి, డీలర్ల ఖాతాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, వ్యాపారుల అక్రమాల వల్ల ధరలు భారీగా పెరిగిపోయే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల చట్టంతోపాటు.. అక్రమార్కులపై ముందస్తు నిర్బంధం (పీడీ) చట్టాన్ని కూడా ప్రయోగించవచ్చన్నారు.