పశ్చిమ బెంగాల్‌ బరిలోకి శివసేన.. తేల్చేసిన సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-01-18T01:30:50+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న మీమాంశకు

పశ్చిమ బెంగాల్‌ బరిలోకి శివసేన.. తేల్చేసిన సంజయ్ రౌత్

ముంబై: పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న మీమాంశకు శివసేన తెరదించింది. ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేతో జరిగిన చర్చల అనంతరం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ ఇదే. పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరేతో జరిగిన చర్చల అనంతరం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శివసేన నిర్ణయించింది. త్వరలోనే మేము కోల్‌కతాను చేరుకోబోతున్నాం. జై హింద్’’ అని సంజయ్ రౌత్ ఈ రోజు ట్వీట్ చేశారు. 


మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీతో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న పొత్తుకు శివసేన చరమగీతం పాడింది. కూటమి భాగస్వామిగా బీజేపీ తన హామీలు నిలుపుకోలేకపోయిందని ఆరోపించింది. కాగా, ఎన్నికలకు నెలల ముందు నుంచే పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో శివసేన ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు మహారాష్ట్రకే పరిమితమైన శివసేన.. ఇప్పుడు పార్టీని విస్తరించాలని నిర్ణయించింది.  


ఇటీవల జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన శివసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీహార్‌లో శివసేన ఫ్లాప్ షో అంటూ ఎద్దేవా చేసింది. బీహార్ బరిలో శివసేన 22 మంది అభ్యర్థులను నిలిపింది. అయితే, 0.05 శాతం ఓట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ఇవి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ కావడం గమనార్హం. 1.68 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. కాగా, భవిష్యత్తులో ఢిల్లీలోనూ కాలు మోపుతామని శివసేన సంకేతాలిచ్చింది. 

Updated Date - 2021-01-18T01:30:50+05:30 IST