షాకింగ్ : ఫోన్ బుక్ చేస్తే ఏం వచ్చాయో చూడండి!
ABN , First Publish Date - 2021-07-15T17:30:15+05:30 IST
ఈ-కామర్స్ వెబ్సైట్లో సెల్ఫోన్ ఆర్డర్ చేస్తే..
- ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు, సర్ఫ్ ప్యాకెట్లు
- 9 శాతం వడ్డీతో పాటు 10 వేల పరిహారం
హైదరాబాద్ సిటీ : ఈ-కామర్స్ వెబ్సైట్లో సెల్ఫోన్ ఆర్డర్ చేస్తే, సబ్బు, సర్ఫ్ ప్యాకెట్లు పంపించింది ఓ పేరున్న సంస్థ. దాంతో బాధితుడు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. సేవాలోపంగా పరిగణించిన ఫోరం, సెల్ఫోన్ ఖరీదు మొత్తానికి 9 శాతం వడ్డీతోపాటు రూ.10వేల పరిహారాన్ని చెల్లించాలని తీర్పు వెలువరించింది. బీకేగూడ ప్రాంతానికి చెందిన పి.విజయ్కుమార్ రూ.11,990 విలువగల ఫోన్ను 2019 డిసెంబర్ 19న అమెజాన్లో ఆర్డర్ చేశాడు. రెండు రోజుల వ్యవధిలో డెలివరీ బాయ్ పార్సిల్ ఇచ్చి వెళ్లాడు. పార్సిల్ వచ్చిన సమయంలో డ్యామేజ్ అయి ఉండటంతోపాటు బాక్స్లో సబ్బు, సర్ఫ్ ప్యాకెట్లు ఉన్నాయి. విజయ్కుమార్ వెంటనే బాక్స్ను ఫొటో తీసి, ఆ సంస్థకు ఫిర్యాదు చేశాడు.
పలుమార్లు మెయిల్ ద్వారా సంప్రదించినా సమాధానం రాకపోవడంతో 2020 మార్చి 3న జిల్లా వినియోగదారుల ఫోరం 2లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన సంస్థ ప్రతినిధులు తమకు ఒప్పో ఫోన్ విక్రేతలకు మధ్య కేవలం అమ్మకం సంబంధం మాత్రమే ఉందని, ఫోన్ విక్రేత చేసిన తప్పునకు తాము ఎలాంటి బాధ్యత వహించలేమని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఫోరం, ఆర్డర్ చేసిన వస్తువు అందించకపోవడం సేవాలోపంగా గుర్తించింది. వినియోగదారుడు ఫోన్ కోసం చెల్లించిన మొత్తానికి 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించడంతోపాటు మానసిక వేదనకు గురిచేసినందుకు రూ. 10వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5వేలు 45 రోజుల్లో చెల్లించాలని హైదరాబాద్ ఫోరం 2 జడ్జి పీవీటీఆర్ జవహర్బాబు తీర్పును వెలువరించారు.