అప్పన్న ఆలయ
ABN , First Publish Date - 2020-11-13T06:09:42+05:30 IST
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఇన్ చార్జి కార్యనిర్వహణాధికారి (ఈవో) వాండ్ర త్రినాథరావు... తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులను కోరినట్టు తెలిసింది.
బాధ్యతల నుంచి తప్పించండి
ఇన్చార్జి ఈవో త్రినాథరావు అభ్యర్థన
సింహాచలం, నవంబరు 12: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఇన్ చార్జి కార్యనిర్వహణాధికారి (ఈవో) వాండ్ర త్రినాథరావు... తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులను కోరినట్టు తెలిసింది. దేవస్థానం భూముల స్థితిగతులపై ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (తిరుపతి) ఎం.సురేంద్ర సమర్పించిన నివేదికపై అమరావతిలో రెండు రోజుల క్రితం దేవదాయ శాఖ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో...తనను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని లిఖిత పూర్వకంగా కోరినట్టు సమాచారం. ఈ నెల 16 నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో తాను విధులు నిర్వర్తిస్తున్న మరో ప్రధాన ఆలయం అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో వ్రతాలు, వివాహాలతో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుందని, ఈ తరుణంలో మరో ప్రధాన ఆలయమైన సింహాచలం బాధ్యతలు నిర్వహించేందుకు తగిన సమయం దొరకదని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఆయన వారంలో ఒకరోజు మాత్రమే సింహాచలం వచ్చి ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. కార్తీక మాసం ప్రారంభమైతే ఆ సమయం కూడా కేటాయించే అవకాశం ఉండకపోవచ్చునని చెప్పినట్టు తెలిసింది.