HYD : ‘నీ సంగతి చూస్తా’ అని ఫోన్ చేసి.. చెల్లెలు భర్త దారుణం..!
ABN , First Publish Date - 2021-11-21T13:38:46+05:30 IST
మహేశ్వరి, లక్ష్మీ అక్కాచెల్లెళ్లు. ,...
- లక్ష్మీగూడలో ఘోరం..
- బాలుడి హత్య
- చెల్లెలు భర్తే దారుణానికి ఒడిగట్టాడని ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్/పహాడీషరీఫ్ : లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ఫేజ్-2లో నాలుగేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. చెల్లెలి భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాటేదాన్ బుద్వేల్ రైల్వేస్టేషన్ బస్తీ సమీపంలోని శ్రీరాంనగర్కు చెందిన మహేశ్వరి, లక్ష్మీ అక్కాచెల్లెళ్లు. మహేశ్వరీకి రాజుతో వివాహమైంది. వారికి శ్రీతన, తేజస్వీ సంతానం. రాజు చనిపోవడంతో మహేశ్వరి.. వినోద్కుమార్రెడ్డిని రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారు లక్ష్మీగూడ రాజీవ్గృహకల్ప ఫేజ్-2లో ఉంటున్నారు. వారికి కుమారుడు లక్కీ(4) ఉన్నాడు. మహేశ్వరి చెల్లెలు లక్ష్మికి వీరన్నతో వివాహమైంది. వీరన్న మద్యం తాగొచ్చి లక్ష్మిని తరచూ కొడుతుండటంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. దీంతో వీరేశ్కు, లక్ష్మి కుటుంబసభ్యులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
వారం రోజుల క్రితం వీరేశ్ మహేశ్వరికి ఫోన్ చేసి తన భార్యను కాపురానికి పంపమని కోరాడు. వారి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన వీరేశ్ ‘నీ సంగతి చూస్తా’ అని ఫోన్లో బెదిరించినట్లు తెలిసింది. శనివారం ఉదయం వీరేశ్ లక్ష్మీగూడకు వచ్చాడు. ఆ సమయంలో మహేశ్వరి పనికి వెళ్లింది. అక్కడే ఉన్న మహేశ్వరి కుమారుడు లక్కీని తీసుకెళ్తుండడంతో ఎక్కడికి తీసుకెళ్తున్నావని అతడి సోదరి తేజస్వీ అడిగింది. మామయ్య దగ్గరకు తీసుకువెళుతున్నానని చెప్పాడు. పని నుంచి ఇంటికి వచ్చిన మహేశ్వరి లక్కీ కనిపించకపోవడంతో మైలార్దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చెల్లెలు భర్త వీరన్నపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులతో పాటు మహేశ్వరి సోదరుడు సుభాష్ అతడి కోసం వెదికారు. వీరన్నను పట్టుకుని సుభాష్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో ఓ బాలుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు 100కు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు అతడు లక్కీగా గుర్తించారు. కరెంటు వైరుతో ఉరి బిగించి కత్తితో పొడిచి చంపినట్లుగా భావిస్తున్నారు. వీరన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.