నిజాం ప్రతిష్ఠించిన సీతారాముడు.. ఎక్కడో కాదు.. హైదరాబాద్‌లోనే..!

ABN , First Publish Date - 2020-11-26T20:49:56+05:30 IST

భిన్నసంస్కృతుల మేళవింపు భాగ్యనగరం. పరమతసహనానికి ప్రతీక. భద్రాద్రి రాముడి కల్యాణానికి హైదరాబాద్‌ రాజ్య ప్రతినిధి ఏటా ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయానికి కుతుబ్‌షాహీలు శ్రీకారం చుట్టారు. తర్వాత నిజాం పాలకులూ కొనసాగించారు.

నిజాం ప్రతిష్ఠించిన సీతారాముడు.. ఎక్కడో కాదు.. హైదరాబాద్‌లోనే..!

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): భిన్నసంస్కృతుల మేళవింపు భాగ్యనగరం. పరమతసహనానికి ప్రతీక. భద్రాద్రి రాముడి కల్యాణానికి హైదరాబాద్‌ రాజ్య ప్రతినిధి  ఏటా ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయానికి కుతుబ్‌షాహీలు శ్రీకారం చుట్టారు. తర్వాత నిజాం పాలకులూ కొనసాగించారు. గంగా జమున తెహజీబ్‌కు అలవాలం భాగ్యనగరం అనడానికి ఇలాంటి ఉదాహరణలెన్నో. అందులో మరొక ముఖ్య ఘట్టం.. మూడో నిజాం స్వయంగా సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించడం. తొలి నిజాం సమయంలో ఉత్తరాదికి చెందిన కొందరు కాయస్థులు హైదరాబాద్‌కి వలసొచ్చారు. అప్పటి నుంచి వాళ్లు ఆస్‌ఫజాహీల కొలువులో వివిధ ఉన్నత పదవులు అలంకరించారు.


అలా మూడో నిజాం సికిందర్‌ ఝా ఏలికలో భవానీ ప్రసాద్‌ రాజభవనాల ఆర్థిక వ్యవహారాలు చూసేవారు. రామభక్తుడైన ప్రసాద్‌ నగరంలో రామమందిరం నిర్మించేందుకు, గద్వాల్‌ సంస్థానం నుంచి రాజా సోము భూపాల్‌ చెక్కించిన సీతారామ, లక్ష్మణ విగ్రహాలను తెప్పించారు. భవానీ ప్రసాద్‌ కోరిక మేరకు 1812లో మూడో నిజాం సికిందర్‌ ఝా సీతారామ, లక్ష్మణ మూలవిరాట్టులను ప్రతిష్ఠించారు. అంతేకాదు, ఆలయ పూజా కైంకర్యాల కోసం కొంత భూమిని మాన్యంగా ఇచ్చారు. గుడి నిర్వహణ కోసం మరికొంత నగదునూ బహూకరించిన సికిందర్‌ రాముడి పట్ల భక్తిని చాటుకున్నారు. పరమత సహనానికి స్ఫూర్తిగా నిలిచారు. మూడో నిజాం ప్రతిష్ఠించిన సీతారాముడు కొలువుదీరిన ఆ దేవాలయమే అత్తాపూర్‌లోని రాంబాగ్‌ ఆలయం. పంతొమ్మిదో శతాబ్దం నాటి ఈ ఆలయం హైదరాబాద్‌ సంస్కృతికి సజీవ సాక్ష్యం.

Updated Date - 2020-11-26T20:49:56+05:30 IST